పాకిస్థాన్‌ తాలిబన్‌ చీఫ్‌ మౌలానా ఫజ్లుల్లా హతం

మలాలాపై కాల్పు జరిపిన  ఉగ్రవాది కాల్చివేత
వెల్లడించిన అమెరికా దళాలు
వాషింగ్టన్‌, జూన్‌15(జ‌నం సాక్షి ) : అఫ్గానిస్థాన్‌లోని తూర్పు కునార్‌ ప్రావిన్స్‌లో అమెరికా దళాలు జరిపిన డ్రోన్‌ దాడిలో పాకిస్థాన్‌ తాలిబన్‌ చీఫ్‌ మౌలానా ఫజ్లుల్లా హతమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని విూడియా వర్గాలు పేర్కొన్నాయి. ఆఫ్గాన్‌లో సీనియర్‌ ఉగ్రవాదులే లక్ష్యంగా డ్రోన్లతో దాడి చేసినట్లు యూఎస్‌ మిలిటరీ గురువారం వెల్లడించింది. ఈ దాడిలో ఉగ్రవాది నాయకుడు హతమైనట్లు తెలిపింది. అయితే ఆ ఉగ్రవాది పేరును మాత్రం అమెరికా దళాలు వెల్లడించలేదు. కాగా.. యూఎస్‌ జరిపిన దాడిలో పాకిస్థాన్‌ తాలిబన్‌ అధిపతి మౌలానా ఫజ్లుల్లా, మరో నలుగురు తహ్రీక్‌ ఇ తాలిబన్‌ కమాండర్లు హతమైనట్లు ఆఫ్గాన్‌లోని స్థానిక విూడియా వర్గాలు పేర్కొన్నాయి. ఫజ్లుల్లా, అతడి కమాండర్లు ఇఫ్తార్‌ విందులో ఉండగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఫజ్లుల్లా 2013లో పాకిస్థాన్‌లోని తాలిబన్‌ చీఫ్‌గా నియమితులయ్యాడు. అప్పటినుంచి అమెరికా, పాకిస్థానీ ప్రజలను లక్ష్యంగా చేసుకుని అనేక దాడులకు పాల్పడ్డాడు. 2014 డిసెంబరులో పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌పై జరిగిన ఉగ్రదాడిలో ఫజ్లుల్లా ప్రధాన సూత్రధారి. ఆ ఘటనలో 151 మంది చిన్నారులు బలయ్యారు. మరో 130 మంది గాయపడ్డారు. అంతేగాక.. నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలాపై 2012లో దాడి చేసింది కూడా ఫజ్లుల్లా, అతడి అనచరుడే అని అమెరికా తెలిపింది. ఫజ్లుల్లాను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడిపై 5 మిలియన్‌ డాలర్ల రివార్డు ఉంది.