పాక్‌ దుశ్చర్య

– కాల్పుల్లో ముగ్గురు భారత జవాన్ల మృతి
శ్రీనగర్‌,అక్టోబరు 1(జనంసాక్షి):సరిహద్దులో పాక్‌ సైన్యం దురాగతాలు ఆగడంలేదు. నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తున్న పాక్‌.. తాజాగా మరో ముగ్గురు భారత సైనికులను బలితీసుకుంది. గురువారం జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ సైన్యం కాల్పులకు తెగబడింది. వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో ముగ్గురు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. పాక్‌ కాల్పులను దీటుగా తిప్పికొట్టినట్టు సైన్యం వెల్లడించింది. కుప్వారా జిల్లాలోని నౌగాం సెక్టార్‌లో భారత జవాన్లపై కాల్పులు జరిపిన ఘటనలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోగా.. నలుగురికి గాయాలయ్యాయి. అలాగే పూంఛ్‌ సెక్టార్‌లో చోటుచేసుకున్న మరో ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు గాయపడ్డారు. అయితే, పాకిస్థాన్‌ వైపు జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారంపై స్పష్టత లేదు.
17 ఏళ్లలో ఇదే అత్యధికం!
గత ఎనిమిది నెలల్లో పాకిస్థాన్‌ 3వేల సార్లకు పైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. 2003లో నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరు దేశాలు చేసుకున్నాయి. అప్పటి నుంచి ఎనిమిది నెలల్లో మూడు వేల సార్లు ఉల్లంఘనలకు పాల్పడటం ఇదే తొలిసారి.