పాక్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌కు తీవ్రఅస్వస్థత

 

కరాచీ, డిసెంబర్‌3(జ‌నంసాక్షి) : పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు పాక్‌ విూడియా వెల్లడించింది. సోమవారం రాత్రి దుబాయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ముషారఫ్‌ చేరినట్లు తెలిపింది. అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధితో ముషారఫ్‌ బాధపడుతున్నారు. దుబాయి అమెరికన్‌ ఆస్పత్రిలో స్టెచ్రర్‌పై ముషారఫ్‌ను తీసుకెళ్తున్న దృశ్యాలను పాక్‌ విూడియా ప్రసారం చేసింది. ఇప్పటికే అమిలోడోసిస్‌ రియాక్షన్‌తో ముషారఫ్‌ బాధపడుతున్నారు. ఈ వ్యాధి వల్ల ముషారఫ్‌ తన కాళ్ల విూద తాను నిలబడలేకపోతున్నారు, నడవలేకపోతున్నారు. గతంలో ఈ వ్యాధి కోసం ఆయన లండన్‌లోనే చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో ఆందోళన కలిగించే విషయమని ఆల్‌ పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే డాక్టర్లు ఇంటికొచ్చి శస్త్రచికిత్స చేసినప్పటికీ.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేర్పించినట్లు అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ప్రస్తుతం ముషారఫ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 2007లో పాకిస్తాన్‌ లో ఎమర్జెన్సీ విధించినందుకు 2013లో ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. 2016 నుంచి ముషారఫ్‌ దుబాయ్‌ లో నివసిస్తున్నారు. ఈకేసు వాయిదా డిసెంబర్‌ 5న ఉంది. కేసులో ముషారఫ్‌ ముద్దాయిగా తేలితే ముషారఫ్‌ కు జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించే అవకాశం ఉంది.