పాస్‌పోర్టు పోగొట్టుకున్న కాశ్యప్‌

ట్విట్టర్‌ ద్వారా సుష్మాకు వినతి
న్యూఢిల్లీ,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్‌ పాస్‌పోర్టు పోగొట్టుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో ఉన్న కశ్యప్‌ తనకు సాయం చేయాలంటూ కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ను కోరారు. ‘ఆమ్‌స్టర్‌డామ్‌లో గత రాత్రి నా పాస్‌పోర్టు పోయింది. నేను డెన్మార్క్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌, జర్మనీలో జరిగే సార్లాక్స్‌ ఓపెన్‌లో పాల్గొనాల్సి ఉంది. డెన్మార్క్‌కు వెళ్లేందుకు ఈ ఆదివారానికి టికెట్‌ కూడా బుక్‌ చేసుకున్నాను. ఈ విషయంలో నాకు సాయం చేయండి’ అని సుష్మాస్వరాజ్‌ సహా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్థన్‌సింగ్‌ రాఠోడ్‌కు ట్యాగ్‌ చేస్తూ కశ్యప్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ను కశ్యప్‌ కాబోయే భార్య, బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ కూడా రీట్వీట్‌ చేశారు. దీనిపై కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ స్పందించాల్సి ఉంది.