పిచ్చి కుక్కల దాడిలో చిన్నారి మృతి

కరీంనగర్: పిచ్చి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మృతి చెందింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం రుద్రంగి గ్రామంలో చోటు చేసుకుంది.  శ్రావణి (6) స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో జున్ 22వ తేదీన పాఠశాలకు వెళ్తున్న శ్రావణిపై పిచ్చికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.

ఆమె పరిస్థితి విషమంగా ఉందని… మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో శ్రావణిని హైదరాబాద్ తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రావణి శనివారం మృతి చెందింది. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పిచ్చికుక్కలను గ్రామం నుంచి తరిమివేయాలని పలుమార్లు గ్రామ పంచాయతి అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు.