పీఎస్‌ఎల్‌వీసీ-50 సక్సెస్‌

సూళ్లూరుపేట,డిసెంబరు 17 (జనంసాక్షి): శ్రీహరికోట సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఈ రోజు 3.41 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-50 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.1410 కిలోల బరువుగల కమ్యూనికేషన్‌ శాటిలైట్లను నింగిలోకి మోసుకెళ్లింది. నాలుగు దశల రాకెట్‌ ప్రయాణాన్ని 20.11 సెకన్లలో ప్రయోగం ముగిసేటట్లుగా శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. సీఎంఎస్‌-01 కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ను నింగిలోకి ఇస్రో పంపింది. సీ-బ్యాండ్‌ సేవల విస్తరణకు సీఎంఎస్‌-01 దోహదపడనుంది. ఏడేళ్లపాటు సేవలందించనుంది. జిశాట్‌-12 స్థానాన్ని సీఎంఎస్‌-01 శాటిలైట్‌ భర్తీ చేయనుంది. సీఎంఎస్‌ -01 దేశానికి చెందిన 42వ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం కాగా, పీఎస్‌ఎల్‌వీ సీ-50 ప్రయోగం మొదటి దశ విజయవంతం అయ్యింది.

ఇస్రో చైర్మన్‌ హర్షం..

పీఎస్‌ఎల్‌వీ సీ-50 రాకెట్‌ ప్రయోగం విజయవంతంపై ఇస్రో చైర్మన్‌ కే శివన్‌ హర్షం వ్యక?తం చేశారు. ఆయన ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. శాటిలైట్‌ అద్భుతంగా పని చేస్తోందని, నాలుగు రోజుల్లో నిర్ణీత స్లాట్‌లో ప్రవేశపెడతామని శివన్‌ పేర్కొన్నారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పీఎస్‌ఎల్వీ రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్తోంది. రెండు టన్నులకు మించి బరువు కలిగిన అతి పెద్ద ఉపగ్రహాలను ఫ్రాన్స్‌, రష్యా అంతరిక్ష సంస్థల నుంచి ఇస్రో పంపిస్తోంది. అతి చిన్న విదేశీ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీల ద్వారా ప్రయోగించి వాణిజ్యపరంగా ఇస్రోకు ఆదాయాన్ని తీసుకొచ్చేగనిగా మారింది. చంద్రయాన్‌, మంగళ్‌యాన్‌ లాంటి గ్రహాంతర ప్రయోగాలు, ఒకేసారి పది ఉపగ్రహాలు, 20 ఉపగ్రహాలు, ఆ తరువాత 104, మళ్లీ 38 ఉపగ్రహాలను సునాయాసంగా మోసుకెళ్లి అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టగలిగిన ఘనత పీఎస్‌ఎలీ?వకే సొంతం. ఇప్పటి వరకు 51 పీఎస్‌ఎల్వీ రాకెట్లను ప్రయోగించగా అందులో రెండు మాత్రమే విఫలమయ్యాయి. గురువారం నాటి ప్రయోగంతో మరో కీలక ఘట్టానికి షార్‌ వేదికైంది.