పెట్టుబడిదారుల చేతుల్లో..  కాంగ్రెస్‌, బీజేపీలు కీలుబొమ్మలు


– సోనియా తెలంగాణతల్లి ఎలా అవుతుంది?
– కేసీఆర్‌ ప్రజలను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడు
– బీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
కరీంనగర్‌, డిసెంబర్‌1(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌, బీజేపీలు పెట్టుబడిదారుల చేతుల్లో కీలు బొమ్మలని బీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌ జిల్లాలో శనివారం ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో తమ్మినేని వీరభద్రం పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ఉద్యమ సమయంలో తెలంగాణ యువత ఆత్మహత్యలకు కారణం ఎవరో ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ తల్లి ఎలా అవుతుందని తమ్మినేని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీలు పెట్టుబడిదారుల చేతుల్లో కీలు బొమ్మలని విమర్శించారు. ఎన్నికల వేళ వివిధ పార్టీల మ్యానిఫెస్టోలు ప్రజలకు తాయిలాలు ఇచ్చేలా ఉన్నాయని, అమలుకు సాధ్యమయ్యే విధంగా ఏ ఒక్కటిలేవని
మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇతరులపై కామెంట్స్‌ చేసి సెంటిమెంట్‌ ద్వారా లబ్ధిపొందాలని
ప్రయత్నిస్తున్నారని అన్నారు. గతంలో ఇచ్చిన హావిూలు అమలు చేయకుండా, మళ్లీ ఏవిధంగా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిపించకపోతే ఫాంహౌస్‌లో రెస్ట్‌ తీసుకుంటాననే వారు ప్రజలకు ఏం సేవచేస్తారని వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలుపెట్టె ప్రలోభాలకు ప్రజలు మోసపోవద్దని, నిజాయితీతో పనిచేసే బహుజన లెఫ్ట్‌ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) అభ్యర్థులను గెలిపించాలని వీరభద్రం కోరారు.
కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు మహిళా బిల్లును ఏమాత్రం పట్టించుకోలేదని, అధికారంలో వున్నప్పుడు చేయలేని పనులను ఇప్పుడు చేస్తామని ప్రజలను మభ్య పెడుతు ఓట్ల  కోసం మోసం చేస్తున్నాయని విమర్శించారు. మరోసారి టీఆర్‌ఎస్‌ పార్టీని ప్రజలు గెలిపించకుంటే రెస్ట్‌ తీసుకంటానని చెబుతున్న కేసీఆర ప్రజలకు సేవ ఎలా చేస్తారని ప్రశ్నించారు.