పెన్నా నదిలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

నెల్లూరు,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): దైవదర్శనం కోసం వచ్చి ఇద్దరు చిన్నారులు పెన్నా నదిలో మునిగి చనిపోయిన ఘటన నెల్లూరులో విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు డైకస్‌ రోడ్డుకు చెందిన దాసరి ప్రసాద్‌, దొరసానమ్మ దంపతులు దైవ దర్శనం నిమిత్తం శుక్రవారం సాయంత్రం జొన్నవాడలోని కామాక్షమ్మ ఆలయానికి వచ్చారు. వీరితో పాటు వీరి కుమార్తె కవిత(15), మేనల్లుడు చరణ్‌ (7) కూడా ఉన్నారు. నలుగురూ కలిసి స్నానానికి పెన్నా నదిలోకి దిగగా.. చిన్నారులిద్దరూ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతయ్యారు. అర్ధరాత్రి వరకూ పోలీసులు, గజ ఈతగాళ్లు గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తిరిగి శనివారం ఉదయం మృతదేహలు నదిలో పైకి తేలాయి. మృతదేహలను పోస్ట్‌మార్టం నిమిత్తం బుచ్చిరెడ్డిపాలెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.