పెళ్లిపేరుతో ప్రియుడు మోసంచేశాడు

– తనకు న్యాయం జరిగేలా చూడాలి
– సెల్‌ టవర్‌ ఎక్కిన యువతి
– వరంగల్‌లో కలకలం సృష్టించిన ఘటన
– యువతికి నచ్చజెప్పి కిందికి దింపిన అధికారులు
వరంగల్‌, మార్చి5(జ‌నంసాక్షి) : పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ప్రియుడు తనను మోసం చేశాడంటూ ఓ యువతి సెల్‌ టవర్‌ ఎక్కింది. తనకు న్యాయం చేయకపోతే అక్కడ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. వరంగల్‌ జిల్లా పెగడపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెగడపల్లికి చెందిన దామర మాలిక అనే యువతికి తొమ్మిదేళ్ల కిందట మోషే అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొత్తగూడెంలో టీఎస్‌ జెన్కోలో విధులు నిర్వహిస్తున్న మోషే.. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పినట్లు మోషే చెబుతోంది. తొమ్మిదేళ్లుగా చెట్టాపట్టాలేసుకొని తిరిగి ఇప్పుడు ముఖం చాటేశాడంటూ మాలిక ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సెల్‌ టవర్‌ ఎక్కింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మాలికకు నచ్చజెప్పి కిందకి దింపే ప్రయత్నం చేశారు. మూడు గంటలకు పైగా సెల్‌ టవర్‌పైనే ఉన్న యువతి అధికారులను ముచ్చెమటలు పట్టించింది. మహిళా సంఘాలు కూడా రంగంలోకి దిగడంతో మరింత కలకలం రేగింది. మాలిక సెల్‌ టవర్‌ ఎక్కిన విషయం తెలుసుకున్న ప్రియుడు మోషే, అతడి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారైనట్లు తెలుస్తోంది. చివరికి మాలికకు నచ్చజెప్పిన అధికారులు ఆమెను సురక్షితంగా కిందకి తీసుకొచ్చారు. పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.