పొదల్లో యువతి శవం: అత్యాచారం చేసి, హత్య చేశారా?

నల్లగొండ: హైదరాబాదుకు చెందిన యువతిపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్లగొండ జిల్లాలోని ఆత్మకూర్(ఎం) మండలానికి చెందిన రాఘవాపురం గ్రామ శివారులోని ముక్కేడి గుట్ట ప్రాంతంలో గుర్తు తెలియని ఇరవై ఏళ్ల యువతి శవం లభ్యమైన విషయం తెలిసిందే. ఆత్మకూరు (ఎం) మండలంలోని నర్సాపురం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మల్లయ్య గుట్టపై గొర్లను మేపుతుండగా చెట్ల పొదల్లోకి వెళ్లిన గొర్రెలను తోలుతున్న క్రమంలో పొదల్లోనుంచి దుర్వాసన రావడాన్ని గమనించాడు. ఇంటికి చేరుకున్నాక విషయాన్ని గ్రామస్తులకు తెలిపాడు. విషయాన్ని తెలుసుకున్న రాఘవాపురం గ్రామానికి చెందిన కొంతమంది యువకులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా ముళ్ల పొదల్లో యువతి మృతదేహం ఉన్నట్లు గుర్తించి పోలీసులకు, వీఆర్వో శ్రీనివాసచారికి సమాచారం అందించారు. ఎస్‌ఐ శివనాగప్రసాద్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డితోపాటు, జిల్లా క్లూస్‌టీం సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.  ఆధారాలకోసం గుట్టచుట్టూ జాగిలాలతో వెతికారు. పసుపు రంగు పంజాబీ డ్రెస్ ధరించిన యువతి(20) యువతి మృతదేహం లభించినట్లు సీఐ బాలంగంగిరెడ్డి తెలిపారు. ఆమె హైదరాబాద్ ప్రాంతానికి చెందినదిగా అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఘటనా స్థలంలో దొరికిన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం డిపోకు చెందిన బస్సు టికెట్ల ఆధారంగా శంషాబాద్, శివరాంపల్లి ప్రాంతానికి చెందిన కొంతమంది యువకులు నాలుగు రోజుల క్రితం సదరు యువతిని రాఘవాపురం గుట్టపైకి తీసుకువచ్చి అత్యాచారానికి పాల్పడి, తర్వాత హత్యచేసినట్లు అనుమానిస్తున్నామన్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి, మృత దేహాన్ని అక్కడే పూడ్చివేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివనాగ ప్రసాద్ తెలిపారు.