పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు.. 

మందకొడిగా సాగుతున్నాయి
– అయినా కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోలేదు
– పోలవరంపై కాగ్‌ కీలక నివేదిక
అమరావతి, సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి) : పోలవరం ప్రాజెక్ట్‌పై కాగ్‌ కీలక రిపోర్ట్‌ ఇచ్చింది. విపరీతమైన జాప్యం, మందకొడిగా పనులు జరుగుతున్నా… కాంట్రాక్టర్లలపై చర్యలు తీసుకోలేదని కాగ్‌ పేర్కొంది. కేంద్ర జలవనరుల సంఘం డీపీఆర్‌ను ఆమోదించకముందే… హెడ్‌వర్క్స్‌ పనులు అప్పగించారని తెలిపింది. ఒప్పందాలు రద్దయి.. ఖర్చు పెరగడంతో.. జాప్యం పెరిగిందని తెలిపింది. 2005లో డీపీఆర్‌ ప్రకారం పోలవరం ప్రాజెక్ట్‌ విలువ రూ.10,151 కోట్లు కాగా, 2010లో డీపీఆర్‌ ప్రకారం రూ.16,010 కోట్లు, తాజా అంచనాల ప్రకారం ప్రాజెక్టు రేటు రూ.55,132 కోట్లకు చేరిందని కాగ్‌ నివేదికలో పేర్కొంది. గత 12 ఏళ్లలో 4,069 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారని.. 192 గ్రామాల విషయంలో పునర్నిర్మాణ ప్రణాళికను ఖరారు చేయలేదని తెలిపింది. ఒడిశా, చత్తీస్‌గఢ్‌లో ముంపు నివారించేందుకు నిర్మించాల్సిన… రక్షణ కట్టల నిర్మాణంలో పురోగతి లేదని చెప్పింది. భూసేకరణ, పునరావాస, పునర్నిర్మాణాలపై… పెట్టిన ఖర్చు వివరాలు వెల్లడించకపోవడంతో రూ.1,408 కోట్లు అందలేదని నివేదికలో పేర్కొంది. దీంతో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయడానికి… హెడ్‌వర్క్స్‌ కాంట్రాక్టర్‌కు రూ.1,854 కోట్ల రాయితీలకు అనుమతించిన పనుల్లో పురోగతి లేదని తెలిపింది. పునరావాస పునర్నిర్మాణ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి వేసిన కమిటీలు నిర్దేశించినట్లు సమావేశం కాలేదని.. అటవీ పర్యావరణ అనుమతులకు సంబంధించి… నిబంధనలు అమలు జరగడం లేదని నివేదికలో కాగ్‌ పేర్కొంది.