పోలింగ్‌ ఏజెంట్ల వివరాలు సమర్పించాలి

పక్కాగా కౌంటింగ్‌ ఏర్పాట్లు: కలెక్టర్‌
యాదాద్రిభువనగిరి,మే18(జ‌నంసాక్షి):  పార్లమెంట్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు విషయంలో ఏజెంట్ల వివరాలను అందజేయాలని, తద్వారా పోలీసు వెరిఫికేషన్‌ చేపట్టనున్నట్లు తెలిపారు. లెక్కింపు రోజున ఉదయం 6.30 గంటలకు సిబ్బంది అంతా కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలని, స్ట్రాంగ్‌ రూంలు తెరిచే సమయానికి అందుబాటులో ఉండాలన్నారు. 23వ తేదీ 8 గంటలకే కౌంటింగ్‌ ప్రారంభమవుతుందని కలెక్టర్‌ తెలిపారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు అనుమానాలను నివృత్తి చేస్తామని కలెక్టర్‌ తెలిపారు. ప్రతి సెగ్మెంట్‌కు ఒక వీడియోగ్రాఫర్‌ను ఏర్పాటు చేసుకోవాలని, కంప్యూటర్లు, ప్రింటర్లు ఇతర సామగ్రితో సిద్ధం కావాలన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల ఏజెంట్లు, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన సహాయ రిటర్నింగ్‌ అధికారులతో ఇప్పటికే సమావేశమై ఓట్ల లెక్కింపుపై అవగాహన కలిగించారు. ప్రతి పనిని సహాయ రిటర్నింగ్‌ అధికారులు స్వయంగా సెగ్మెంట్ల వారీగా పర్యవేక్షించుకోవాలని ఆదేశించారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా 14 టేబుల్స్‌పైన ఓట్ల లెక్కింపు చేపట్టాలని, ఆర్‌ఓ టేబుల్‌పైన పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కించాలన్నారు.  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించి 5 వీవీ ఫ్యాట్స్‌ లెక్కింపు చేపట్టాలని, ఇందుకు డ్రా పద్ధతిలో పోలింగ్‌ కేంద్రాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.   ప్రతి టేబుల్‌పై పోలింగ్‌ కేంద్రం నెంబర్లను నమోదు చేసుకుని వాటి ఆధారంగా ఓట్ల లెక్కింపు చేపట్టాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు.