ప్రగతి నివేదన సభకు భారీగా తరలిరావాలి

– ఈ సభ దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతుంది
– ఉమ్మడి వరంగల్‌ నుంచి 3లక్షల మందిని తరలించేందుకు చర్యలు
– కళ్లుండి చూడలేని కంబోదుల్లా కాంగ్రెస్‌ నేతల తీరు
– కంటి వెలుగు శిబిరాల్లో పరీక్షలు చేయించుకోండి.. అభివృద్ధి కనిపిస్తుంది
– అసత్యాలను ప్రచారం చేస్తే ప్రజలే గుణపాఠం చెబుతారు
– డజనుకుపైగా ముఖ్యమంత్రి అభ్యర్థులున్న పార్టీ కాంగ్రెస్‌
– వారిలో ఒక్కరూ కేసీఆర్‌ ముందు నిలబడే శక్తున్నోళ్లు లేరు
– భూపాలపల్లి నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
భూపాలపల్లి, ఆగస్టు30(జ‌నం సాక్షి) : సెప్టెంబర్‌ 2న కొంగరకలాన్‌లో జరగనున్న ప్రగతి నివేదన సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని, సభకు ఒకరోజు ముందే వచ్చి భూపాలపల్లి సత్తా చాటాలని మంత్రి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. భూపాలపల్లి నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశం గురువారం జరిగింది. ఈ  సందర్భంగా మంత్రి కడియం శ్రీహరి పాల్గొని మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కొంగర కలాన్‌ ప్రగతి నివేదన భారీ బహిరంగ సభ భారత దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతుందని కడియం అన్నారు. ఉద్యమ సమయంలోనూ, అధికారంలోకి వచ్చాక కూడా ఇలాంటి భారీ బహిరంగ సభలు పెట్టే సత్తా, దమ్ము టీఆర్‌ఎస్‌ పార్టీకే ఉందన్నారు. 25 లక్షల మందితో సభ పెట్టాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని, కానీ ప్రజలు అంతకంటే ఎక్కువ సంఖ్యలో రావడానికి సిద్ధంగా ఉన్నారని కడియం తెలిపారు. మేమే వారికి సరిపడా వాహనాలు సమకూర్చే పరిస్థితిలో లేమన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి 3 లక్షల మంది తీసుకెళ్లే లక్ష్యంతో సమన్వయం చేసుకుంటున్నామని కడియం పేర్కొన్నారు.  సభ లక్ష్యాలను సీఎం కేసీఆర్‌ ఇప్పటికే పలుసార్లు చెప్పారని, తెలంగాణ ప్రభుత్వం గత 4 సంవత్సరాల 3 నెలల పాలనలో చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి నివేదించడానికి ఈ సభ నిర్వహిస్తున్నామని కడియం
పేర్కొన్నారు. సభసన్నాహక సమావేశాల్లో ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి బ్రహ్మాండమైన స్పందన వస్తుందన్నారు.
24గంటల విద్యుత్‌తో కేసీఆర్‌ అద్భుతం సృష్టించారు..
రాష్ట్రంలో పంటరుణం 17 వేల కోట్ల రూపాయలు 4 విడతలుగా మాఫీచేశాంమని, తెలంగాణ ఉద్యమం చేస్తున్నపుడు నాటి సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి తెలంగాణ వస్తే కరెంట్‌ రాదు, ఆగం అవుతారని చెప్పాడని, అప్పుడు నాకు కూడా కొంత వరకు అనుమానం వచ్చిందని కడియం పేర్కొన్నారు. ఎందుకంటే అప్పటి రాష్ట్రంలో కరెంట్‌ సరిగా వచ్చేది కాదని, కానీ అలాంటి పరిస్థితిని అధిగమించి కోతలు లేని 24 గంటల ఉచిత విద్యుత్‌ వరకు వచ్చాము. 24 గంటలు కరెంట్‌ వద్దు.. బోర్లు ఎండుతున్నాయి.. 12 గంటలు చాలు అనే వరకు రావడం అద్భుతం మని, సీఎం కేసీఆర్‌ చేతల్లో చేసి చూపిన అద్భుతం ఇదని కోనియాడారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 24 గంటల ఉచిత కరెంట్‌ వ్యవసాయానికి ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని కడియం ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనలో ఎరువుల కోసం పరుగెత్తి ఉప్పలయ్య అనే రైతు గుండె పోటు వచ్చి చనిపోయాడని, ఇది 2008 లో జరిగితే కాంగ్రెస్‌ ఆయన కుటుంబానికి ఇప్పటి వరకు న్యాయం చేయలేదన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకు ఎరువులు, విత్తనాలు కావాల్సినన్ని అందుబాటులో ఉంచారని, ఆ పరిస్థితి లేకుండా చేశారన్నారు.  రైతు పెట్టుబడి కోసం ఏటా ఏకరానికి 8000 రూపాయలు ఇచ్చే రైతు బంధు వంటి పథకం దేశంలో ఎక్కడైనా ఉందా? రైతు చనిపోతే ఆ కుటుంబ రోడ్డున పడకుండా ఉండాలని ఏటా 2271 ప్రీమియం చెల్లించి రైతు బీమా అమలు చేస్తున్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందో తెరాస ప్రభుత్వాన్ని విమర్శించే వారు చెప్పాలని కడియం ప్రశ్నించారు.  అవగాహన, సిగ్గులేకుండా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు.
కళ్లుండి కనిపించని కబోద్దులా కాంగ్రెస్‌ నేతల తీరు..
72 ఏళ్ల స్వాతంత్యం తర్వాత కూడా గ్రామాల్లో రక్షిత మంచినీరు లేదని గుర్తించిన సీఎం ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు ఇచ్చేందుకు 46వేల కోట్ల రూపాయలతో మిషన్‌ భగీరథ తీసుకొచ్చారని, ఇవన్ని కాంగ్రెస్‌ నేతలకు కనిపించడం లేదు, వినిపించడం లేదని ఎద్దేవా చేశారు.  విూకు కళ్ళు కనిపించకపోతే మా కంటి వెలుగులో పరీక్షలు చేయించుకొని అద్దాలు పెట్టుకొని జరిగే అభివృద్ధి చూడండి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఎందుకు కావాలి.. దోచుకోవడానికా అని ప్రశ్నించారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హౌసింగ్‌ మంత్రిగా ఉన్నపుడే కదా ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగి కేసులు నమోదయ్యాయి, నువ్వు నీతి గురించి మాట్లాడుతావా? కాంగ్రెస్‌ లో అధికారం అడ్డం పెట్టుకొని దోపిడీ, సెటిల్‌ మెంట్లు, అక్రమాలు చేస్తారన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో డజనకుపైగా ముఖ్యమంత్రి అభ్యర్థులున్నారని, ఒక్క నల్గొండలో ముగ్గురున్నారని అన్నారు. మహబూబ్‌ నగర్‌ లో ఇద్దరు.. ఇలా జిల్లాకు ఎంతమంది ముఖ్యమంత్రులు అవుతారని కడియం ప్రశ్నించారు. అసలు వీరిలో ఎంతమంది ఎమ్మెల్యేలు గా గెలుస్తారని, అసలు ఎమ్మెల్యే గా గెలువలేనప్పుడు సీఎం ఎలా అవుతారని అన్నారు. అసలు వీరిలో ఎవరికైనా కేసీఆర్‌ ముందు నిలబడే ధైర్యం ఉందా అంటూ ఎద్దేశా చేశారు.
మధుసుధనాచారి గెలుపుతోనే అభివృద్ధి..
స్పీకర్‌ ప్రతి మంత్రిని అడిగి నిధులు తెస్తున్నారని, ఆర్‌ అండ్‌ బి రోడ్లకు 600 కోట్లు, సీసీ రోడ్లకు 100 కోట్ల రూపాయలు తెచ్చారన్నారు. ఇంత పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారని కోనియాడారు. సీఎం కేసీఆర్‌ కి స్పీకర్‌ మధుసూధనాచారి కుడి భుజంమని, సీఎం కేసీఆర్‌ కి స్పీకర్‌ సన్నిహితులు, మళ్ళీ మధుసూదనాచారి ఎమ్మెల్యే అయితే భూపాలపల్లి స్వరూపమే మారుతుందన్నారు. ఎవరైనా పసలేని, పనిలేని మాటలు అన్నా, ప్రచారం చేసినా పట్టించుకోవద్దని, తప్పుడు వార్తలు నమ్మొద్దని, ఎంపీ ఎన్నికల్లో విూరు భారీ మెజారిటీ ఇచ్చారని, కాబట్టి నావంతుగా నేను భూపాలపల్లి కి అన్ని రకాలుగా అండగా ఉంటానని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌ బోడెకుంటి వెంకటేశ్వర్లు, వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వాసుదేవ రెడ్డి, పార్టీ నాయకులు సమ్మారావు, పరంజ్యోతి, స్థానిక నేతలు, ఇంఛార్జీలు పాల్గొన్నారు.