ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలతో వైకాపా ప్రభుత్వం అసహనానికి లోనవుతోంది : చంద్రబాబు

అమరావతి: పాలనను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టాలనుకుంటే రాష్ట్రంలోని 5 కోట్లమంది పైనా పెట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.సంక్షేమ పథకాల్లో కోతలు, అభివృద్ధి పనులపై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలతో వైకాపా ప్రభుత్వం అసహనానికి లోనవుతోందని చెప్పారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు పరిధిలోని వేపనపల్లి ‘విద్యాదీవెన’పై ఎమ్మెల్యేను ప్రశ్నించిన ఇంజినీరింగ్‌ విద్యార్థి జశ్వంత్‌పై కేసు పెట్టి అరెస్ట్‌ చేయడం ప్రభుత్వ అసహనానికి ప్రత్యక్ష సాక్ష్యమని ఆక్షేపించారు. ఈ మేరకు చంద్రబాబు ఓ ప్రకటన విడుదల చేశారు.విద్యార్థులపైనా కేసులు పెట్టి వారి జీవితాలను నాశనం చేస్తారా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా పాలనపై గడపగడపలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. కాలర్‌ ఎగరేసుకుని తిరుగుదామనుకున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలను.. కాలర్‌ పట్టుకుని జనం ప్రశ్నిస్తున్నారని చెప్పారు. వేపనపల్లిలో జరిగిన ఘటనపై వైకాపా క్షమాపణ చెప్పాలని.. జశ్వంత్‌తో పాటు అతడికి మద్దతుగా నిలిచిన గ్రామస్థులు, తెదేపా నేతలపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. స్థానిక పోలీసుల అత్యుత్సాహంపై డీజీపీ చర్యలు తీసుకోవాలన్నారు.