ప్రజాస్వామ్యంలో చీకటి రోజు

` రాహుల్‌పై వేటును తీవ్రంగా ఖండిరచిన భారాస అధ్యక్షుడు కేసీఆర్‌
` అనర్హత రాజ్యాంగ దుర్వినియోగం
` మోడీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని వ్యాఖ్య
హైదరాబాద్‌(జనంసాక్షి): కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్తీవ్రంగా ఖండిరచారు. ప్రధాని మోదీపాలన ఎమర్జెన్సీని మించిపోతుందని కేసీఆర్‌ మండిపడ్డారు. నేరస్తులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొని తెచ్చుకుంటున్నారని కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌పై అనర్హత వేటు వేయడంపై కేసీఆర్‌ ప్రకటన విడుదల చేశారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు. రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం నరేంద్రమోదీ దురంహంకారానికి, నియంతృ త్వానికి పరాకాష్ట. రాజ్యాంగబద్ద సంస్థలను దురుపయోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యలకోసం మోదీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయం అని తన ప్రకటనలో కెసిఆర్‌ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించింది. మోదీ పాలన ఎమర్జన్సీని మించిపోతున్నది. ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయింది. నేరస్థులు, దగాకోరుల కొసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారు. పార్టీల మధ్య వుండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఖండిరచాలి. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలి అని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇకపోతే కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీలోక్‌సభ సభ్యత్వం రద్దును బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా ఖండిరచారు. రాహుల్‌పై అనర్హత వేటు వేయడం.. రాజ్యాంగాన్ని దుర్వినియోగపరచడమే అని కేటీఆర్‌ పేర్కొన్నారు. అత్యంత అప్రజాస్వామిక పద్ధతిలో రాహుల్‌పై వేటు వేశారని, ఇది తొందరపాటు చర్య అని కేటీఆర్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫ్రెంచ్‌ తత్వవేత్త వాల్‌టేర్‌, జర్మన్‌ థియాలజిస్ట్‌ మార్టిన్‌ నిమాలర్‌ కోట్స్‌ను కేటీఆర్‌ తన ట్వీట్‌లో షేర్‌ చేశారు.