ప్రతిష్టాత్మకంగా పంచాయితీ ఎన్నికలు : ఎమ్మెల్యే

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌15(జనంసాక్షి): అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ దేశం తెలంగాణ వైపు చూసేలా సిఎం కెసిఆర్‌ పరిపాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ప్రజల కోసం ఇంతగా పరితపిస్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాల్సిన బాద్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందన్నారు. మరో పక్షం రోజుల్లో స్థానిక సమరం ప్రారంభమవుతుందని, నియోజకవర్గ పరిధిలో ప్రతి గ్రామపంచాయతీని టీఆర్‌ఎస్‌ గెలుచుకునేలా ప్రతి కార్యకర్త శ్రమించాలని కోరారు. పంచాయితీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తసీఉకుని టిఆర్‌ఎస్‌ శ్రేణులు ముందుకు సాగాలన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే ప్రజలను టీఆర్‌ఎస్‌ దరికి చేరుస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పరుగులు తీయిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పల్లెల సమగ్రాభివద్ధే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ముందుకు సాగుతోందని, సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పల్లెలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రోళ్ళపాడు ప్రాజెక్టును ఈ ప్రాంత వాసులు కలలోనైనా ఊహించలేదని, అటువంటి ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్‌ స్వయంగా వచ్చి శంకుస్థాపన చేయడమే కాకుండా వెనువెంటనే నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. అటవీశాఖ అనుమతులు కూడా వచ్చినందున త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. అన్నదాతలకు పెట్టుబడుల కోసం ఎకరానికి రూ.4వేలు మంజూరు చేసిన విషయం రైతులకు తెలియంది కాదన్నారు.

——