ప్రతి గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

– గ్రామాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం
– తాగునీటి సమస్య లేకుండా దృష్టిసారిస్తాం
– తెరాస అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
– ఎన్నికల ప్రచారంలో మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, మే4(జ‌నంసాక్షి) : ప్రతి గ్రామాభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టిపడి ఉందనీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపుతో మరింత వేగవంతంగా అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం తాడిపర్తి, ఏదుట్ల తదితర గ్రామాల్లో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏదుట్ల సవిూపంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు, కూలీలను ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి.. పోటీలో ఉన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పరిషత్‌ బరిలో నిలిచిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయం కోసం ప్రజలు కలిసి రావాలని
పిలుపునిచ్చారు. గత ఐదేళ్లు కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ది కార్యక్రమాలు మరింత మెరుగైన వసతులను ప్రతి గడపకు చేరాలంటే టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ. జడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం సహకారంతోనే నియోజకవర్గంలోని ప్రతి పల్లెకు సాగునీరు తీసుకువచ్చామని మంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు పేరుకు మాత్రమే సంక్షేమ కార్యక్రమాలు చేసేవనీ, తెలంగాణ ప్రభుత్వం గడపగడపకూ ప్రతి సంక్షేమ పథకం చేరేలా కృషి చేస్తుందన్నారు. ఈ నెల 6న జరుగునున్న ఎన్నికల్లో ఎంపీటసీ, జడ్పీటీసీ స్థానాలకు బరిలో నిలిచిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నాయని నిరంజన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి పనులు చూసిన వారు మనకు ఎల్లప్పుడూ అండగా ఉంటారన్నారు. కరెంటు, సాగునీరు కేసీఆర్‌తోనే సాధ్యమయ్యాయని, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసుకుని 60ఏండ్లు నష్టపోయిన సాగునీటిని సాధించుకోగలిగామని మంత్రి వివరించారు. ప్రతి గడపకు వెళ్లి ప్రతి ఓటును అర్జించాలని ప్రజల మద్దతుతోనే విజయం సాధించి తిరిగి రావాలని మంత్రి అభ్యర్థులకు సూచించారు. గత నాలుగున్నర ఏండ్ల పాలనలో తెలంగాణలో ఊహించని విధంగా అభివృద్ధి జరిగిందని, దేశంలోనే ఎవ్వరు ఊహించని విధంగా సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలను శ్రీకారం చుట్టారన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలన్ని రైతులను, వ్యవసాయాన్ని విస్మరించడంతో రైతులు సంక్షోభంలోకి నెట్టివేయబడ్డారని, కేసీఆర్‌ తన నిర్ణయాలతో దేశం దృష్టిని ఆకర్షించారన్నారు. ఇప్పుడే తెలంగాణ రైతు ఆత్మవిశ్వాసంతో ఉన్నారని, ప్రతి రైతు మోములో చిరునవ్వు కోసం పని చేస్తున్నామన్నారు. నేతలందరూ పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపునకు కలిసికట్టుగా పనిచేయాలన్నారు.