ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో పథకాల అమలు
ఇతర రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నాయి
అధికారులంతా సమిష్టిగా ముందుకు సాగాలి
ఉమ్మడి వరంగల్‌ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలి
డిప్యూటీ సీయం శ్రీహరి
అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధికారులతో కడియం సవిూక్ష
వరంగల్‌, జూన్‌20(జ‌నం సాక్షి) : ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అమలవుతున్న మిషన్‌ భగీరథ, వ్యవసాయ సంబంధిత పథకాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వరంగల్‌ లోని నందన గార్డెన్స్‌ లో ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో సవిూక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో వినూత్నంగా అమలు చేస్తున్న అనేక పథకాలు నేడు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయన్నారు. అనేక రాష్ట్రాలు ఇక్కడికి వచ్చి వాటిని అధ్యయనం చేస్తున్నాయని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో అమలు చేయాలని చూస్తున్నాయని కడియం తెలిపారు. ఇంత గొప్ప పథకాలు రాష్ట్రంలో ప్రజలందరికీ అందేందుకు అధికారులంతా సమిష్టిగా కృషి చేయాలని కడియం సూచించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో మొదటి, రెండు స్థానాల్లో ఉండేదని, ఇప్పుడు ఆయా పథకాల అమలు కూడా అదేస్థాయిలో ఉండేలా అధికారులు పనిచేయాలని కడియం సూచించారు. జిల్లాల పున్ణ విభజన వల్ల పరిధి తగ్గి ప్రజలకు తొందరగా చేరేందుకు సులభం అయ్యిందని, ఈ నేపథ్యంలో పథకాలను ప్రజల వద్దకు మరింత పకడ్బందీగా తీసుకెళ్లాలని కడియం తెలిపారు. రైతుబంధు పథకం రూపకల్పన నుంచి నేటి అమలు వరకు మన పూర్వ వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ గా పనిచేసి ఇప్పుడు సీసీఎల్‌ఏ డైరెక్టర్‌ గా పనిచేస్తున్న వాకాటి కరుణ క్రీయాశీలకంగా ఉన్నారన్నారు. రైతుబంధు కార్యక్రమంలో ఉన్న ఇబ్బందులను కలెక్టర్లు, అధికారులు ఆమె దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించుకొనే అవకాశం ఉంటుందని కడియం తెలిపారు. తర్వాత మిగిలిన పథకాలపై చర్చించుకుందామని కడియం శ్రీహరి సూచించారు. ఈ సమావేశానికి గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్‌, ప్రభుత్వ విప్‌ బోడెకుంటి వెంకటేశ్వర్లు, జడ్పి చైర్‌ పర్సన్‌ గద్దల పద్మ, ఎంపీలు బండ ప్రకాష్‌, సీతారాం నాయక్‌, ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్‌, అరూరి రమేష్‌, తాటికొండ రాజయ్య, శంకర్‌ నాయక్‌, వినయ్‌ భాస్కర్‌, చైర్మన్లు రాజయ్య యాదవ్‌, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, మర్రి యాదవరెడ్డి, సంపత్‌, లింగంపల్లి కిషన్‌ రావు, వాసుదేవరెడ్డి, సీసీఎల్‌ఏ డైరెక్టర్‌ వాకాటి కరుణ, కలెక్టర్లు ఆమ్రపాలి, హరిత, అమేయకుమార్‌, శివలింగయ్య, వరంగల్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ కమిషనర్‌ గౌతమ్‌, జాయింట్‌ కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.