ప్రభుత్వ ప్రాధాన్యంలో తెలంగాణకు హరితహారం
జులై రెండో వారంలో నాలుగో విడత హరితహారం
రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి సిబ్బందికి రెండు రోజుల శిక్షణ
మొక్కలు, నాటే ప్రాంతాల ఎంపిక, పిట్స్ తవ్వకం పూర్తి చేయాలి
జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కుల నాటాలి
అన్ని జిల్లాల కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ డా.ఎస్.కె జోషి వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్,జూన్19(జనం సాక్షి ): ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతా పథకాల్లోతెలంగాణకు హరితహారం ఒకటని చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషి అన్నారు. దీని విషయంలో ఏమాత్రం పొరపాట్లు జరగకుండా నాలుగో విడత హరితహారం కోసం సన్నద్దం కావాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖలకు చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషి పిలుపు నిచ్చారు. ఈయేడాది హరితహారంలో రాష్ట్ర వ్యాప్తంగా 39 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించామని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మొక్కలు నాటే ప్రాంతాల గుర్తింపులో కొన్ని జిల్లాలు వెనుకపడ్డాయని తక్షణం ఆ పక్రియను పూర్తి చేయాలన్నారు. ప్రణాళిక ప్రకారం ప్రాంతాల గుర్తింపు, ముందుస్తుగా పిట్స్ తవ్వకం, రక్షణా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సారి హరితహారంలో స్కూలు పిల్లలు పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నామని, వారినే ప్రతీ ఇంటి హరితహారం వారధిగా గుర్తించాలన్నారు. అలాగే ఈత మొక్కలు నాటేందుకు ముందుకు వచ్చే రైతులకు హార్టీకల్చర్ డిపార్ట్ మెంట్ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. కోతుల బెడద నివారణ కోసం ప్రతీ జిల్లా అటవీ ప్రాంతాల్లో 5 నుంచి 6 లక్షల పండ్ల మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. హరితహారం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర స్థాయిలో ఈ నెల 25, 28 తేదీల్లో శిక్షణా కార్యక్రమం ఉంటుందని, సంబంధింత శాఖల నుంచి డీపీఓ, డీఎప్ఓ, మున్సిపల్, డీఆర్డీడీవో, వ్యవసాయ, హార్టీ కల్చర్ అధికారులు పాల్గొంటారని, వీరే ఆ తర్వాత జిల్లా , మండల స్థాయిలో శిక్షణ ఇస్తారని వెళ్లడించారు. గత హరితహారంలో నాటిన మొక్కలు బతికిన శాతంతల్చేందుకు రాండమ్ సర్వే నిర్వహించనున్నామని, థర్డ్ పార్టీ టీమ్ లను ఎంపిక చేసి ఈ పక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లను చీఫ్ సెక్రటరీ ఆదేశించారు. అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందని, ఆయా శాఖలకు కేటాయించిన పార్కుల పనులు జులై 15 నుంచి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ లోగా ప్రణాళికల తయారీ, టెండర్ల పనులు పూర్తి చేయాలన్నారు. శిక్షణ వివరాలు త్వరలోనే జిల్లాల వారీగా పంపుతామని, అదే విధంగా హరితహారంలో భాగంగా నాటేందుకు సిద్దంగా ఉన్న మొక్కలు, రకాల వివరాలతో జిల్లాల వారీ డైరెక్టరీలను సిద్దం చేయాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా తెలిపారు. కొత్త పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం నర్సరీల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, సిబ్బంది అకింత భావంతో పనిచేస్తేనే హరితహారం విజయవంతం అవుతుందని పీసీసీఎఫ్ పీ.కే.ఝా అన్నారు. మూడేళ్ల ఫలితాలు ఇప్పుడు పెరిగిన పచ్చదనం రూపంలో మన కళ్ల ముందు కనిపిస్తున్నాయని, నాలుగో విడతలో ప్రజా భాగస్వామ్యం మరింత పెరిగేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. గత యేడాది వరకు కోటీ డెభై లక్షల ఈత మొక్కలు నాటామని, ఈయేడాది రెండు కోట్ల ఈత మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఎక్సయిజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు.రాష్ట్రంలో జాతీయ రహదారుల భూసేకరణ పక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సంగారెడ్డి, నాందేడ్, అకొలా కు సంబంధించి సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపించి భూసేకరణను వేగవంతం చేయాలన్నారు. మన్నెగూడకు సంబంధించి రంగారెడ్డి, 7జడ్చర్ల కు సంబంధించి మహబూబునగర్, మంచిర్యాల, చంద్రాపూర్ కు సంబంధించి మంచిర్యాల, ఆసిఫాబాద్కు సంబంధించి జగిత్యాల, కరీంనగర్,వరంగల్ కు సంబంధించి సూర్యపేట జిల్లాకలెక్టర్లు భూసేకరణను పూర్తి చేయాలన్నారు. జాతీయ రహదారులు సకాలంలో పూర్తి కావడంలో భూసేకరణ కీలకమని, కాంట్రాక్టర్లకు నిర్ణీత సమయంలో పనులు ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. తదుపరి సమావేశం లోగా భూసేకరణ అంశాన్ని పూర్తి చేయాలన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో పంచాయితీ రాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్, అదనపు అటవీ సంరక్షణ అధికారి ఆర్.ఎం.డోబ్రియల్ తదితరులు పాల్గొన్నారు.