ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఇన్‌స్పెక్టర్‌

వారణాసి,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి):  సీఐఎస్‌ఎఫ్‌ ఇన్‌ స్పెక్టర్‌ ఓ ప్రయాణికుడి ప్రాణాలను కాపాడి..అందరి ప్రశంసలు అందుకున్నారు. వారణాసి ఎయిర్‌ పోర్టు ఆవరణలో ఓ ప్రయాణికుడికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన సీఐఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ నీరజ్‌ కుమార్‌ సదరు ప్రయాణికుడికి వెంటనే కార్డియోపల్మనరీ రెసస్కిటేషన్‌ (సీపీఆర్‌)అందించారు. నీరజ్‌ ఆ తర్వాత ప్రయాణికుడిని ఆస్పత్రిలో చేర్పారు. సీపీఆర్‌ తర్వాత వెంటనే వైద్యసేవలు అందించడం వల్ల ప్రయాణికుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కుప్పకూలిపోయిన ఆ ప్రయాణికుడికి సకాలంలో సీపీఆర్‌ అందించి రక్షించిన నీరజ్‌ కుమార్‌ ను ఎయిర్‌ పోర్టులో ఉన్న సిబ్బంది, ప్రయాణికులు ప్రశంసలతో ముంచెత్తారు.