ప్రశ్నిస్తే పరువునష్టం దావా వేస్తారా?

టీటీడీకి పరువునష్టం దావావేసే అధికారం ఎవరిచ్చారు
స్వామివారి పరువు 100కోట్లే అని వారే నిర్ణయించారు
తిరువాభరణాలు తరలిపోతున్నాయి
స్వామి గుప్త నిధుల కోసమే తవ్వకాలు జరిపారన్న తన ఆరోపణలపై సమాధానం చెప్పాలి
తన ఆరోపణలపై నిష్పక్షపాతమైన విచారణ జరపాలి
శ్రీవారి నగలు భద్రంగా ఉన్నాయని నిరూపించుకోవాలి
విలేకరుల సమావేశంలో టీటీడీ పూర్వ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు
హైదరాబాద్‌, జూన్‌20(జ‌నం సాక్షి ) : టీటీడీ విషయంలో తాను చేసిన ఆరోపణలపై పాలకమండలి రూ.100కోట్ల పరువు నష్టం దావా వేసిందని…స్వామి వారి పరువు 100 కోట్లే అని వారే నిర్ణయించారని తిరుమల పూర్వ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు అన్నారు. బుధవారం హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో విూడియాతో మాట్లాడుతూ తన ఆరోపణలపై నిష్పక్షపాతమైన విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. శ్రీవారికి అన్ని పూజలు సరిగ్గా జరుగుతున్నాయని నిరూపించుకోవాలని ఆయన అన్నారు. అలాగే శ్రీవారి నగలు భద్రంగా ఉన్నాయని నిరూపించుకోవాలని రమణదీక్షితులు తెలిపారు. తనపై పరువునష్టం దావా వేయాలని టీటీడీకి ఎవరు సలహా ఇచ్చారో తెలియదని ఆయన అన్నారు. ప్రశ్నిస్తే పరువునష్టం దావా వేస్తారా? అని నిలదీశారు. ఇది ప్రజాస్వామ్యమా… నిరంకుశత్వమా? అని ప్రశ్నించారు. టీటీడీకి పరువునష్టం దావా వేసే అధికారం ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరువాభరణాలు తరలిపోతున్నాయంటూ రమణదీక్షితులు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట్లాది మంది ఇలవేల్పుగా కొలుచుకునే తిరుమల శ్రీనివాసుడి మహిమలు అపారమైనవి అన్నారు. స్వామి గురించి పురాతన తాళపత్ర గ్రంథాల్లో ఉన్న వివరాలు తెలుసుకుంటే భక్తులకు మతిపోవడం ఖాయమని రమణదీక్షితులు పేర్కొన్నారు. ‘శ్రీకృష్ణదేవరాయల తర్వాత విజయనగర రాజ్యాధిపతిగా తిరుమలరాయలు శ్రీవారిని దర్శించుకుని సుమారు 1000 ఏనుగులు, 30 వేల అశ్వాలపై అమూల్యమైన సంపదలను తిరుమలకు తీసుకు వచ్చి ఎక్కడో నిక్షిప్తం చేశారని మనకు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది… కానీ, కలియుగంలో మనుషులకు తీవ్రమైన పేరాశ కలుగుతుందని, దైవమంటే భయం, భక్తి ఉండవని భావించి, ఆ సంపదనంతా కొన్ని ప్రదేశాల్లో సామాన్యుల ఊహకు అందని విధంగా నిక్షిప్తం చేశారని వాటిలో చెప్పబడివుందన్నారు. ‘క్రీ.శ. 1,800 సమయంలో ఆర్కాట్‌ కలెక్టరుగా ఉన్న ఒక ఆంగ్లేయుడు తిరుమలకు వచ్చి, శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని కార్యక్రమాలనూ సవివరంగా సవిూక్షించారన్నారు. అర్చకులు, పరిచారకులు, ఉద్యోగులు అదే విధంగా స్వామివారి దేవాలయాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న అనేక వృత్తులవారిని పిలిపించి, వారి కర్తవ్యాలు, వారు చేసే సేవలు, అందుకు ఫలితంగా వారికి లభించే వరుంబడి గురించి ఆరా తీసి ప్రశ్నోత్తరాలుగా క్రోఢీకరించి… ‘సవాల్‌ జవాబ్‌ పట్టీ’ అనే దాన్ని తయారు చేశారన్నారు. అది మనకు ఇప్పటికీ ప్రామాణికమైన గ్రంథంగా ఉందన్నారు. అందులో స్వామివారి కైంకర్యాలు, వాటి ప్రాముఖ్యతను వివరించారన్నారు. తరువాత ఒకచోట స్వామివారి తిరువాభరణాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని తెలియజేశారు.
‘స్వామివారిని 1000 కోట్ల దేవుడని పిలిచేవారని, ముఖ్యంగా కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు, 18 లక్షల బంగారు మొహరీలు ఉపయోగించి, మూలవిరాట్టుకు (తొమ్మిదిన్నర అడుగుల ఎత్తైన మూలవరులకు) నవరత్న కవచాన్ని తయారుచేసి ‘రత్నాంగిణి’ అనే పేరుతో సమర్పించినట్టు, తరువాత అదే సందర్భంలో ఒక్కోటి కిలో బరువుండే 18 లక్షల బంగారు మొహర్లతో స్వామికి కనకాభిషేకం నిర్వహించారన్నారు. ఇంకా అమూల్యమైన నవరత్నాలు, బంగారు విగ్రహాలను దేవాలయం మొదటి ప్రాకారంలో ఓ నేలమాళిగను ఏర్పాటు చేసి… దాని కొలతలు కూడా స్పష్టం చేశారన్నారు. ఆ గదిలో సంపదనంతా భద్రపరిచి, తలుపులు బిగించిన తర్వాత, దానిపై బండలు పరిచారని, అది సామాన్య భక్తులు ప్రవేశించలేని విధంగా ఉంటుందని వివరంగా చెప్పబడింది’ అని రమణ దీక్షితులు వెల్లడించారు. అలాగే పల్లవులు, చోళులు తదితర రాజులు, వారి సామంతలు ఇచ్చిన అమూల్యమైన ఆభరణాలను కూడా మొదటి ప్రాకారంలో దాచారని తాళపత్ర గ్రంథాలు చెబుతున్నాయన్నారు. తొలి ప్రాకారంలో భక్తులు వెళ్లలేని ప్రదేశాలు రెండున్నాయని, వాటిలో ఒకటి స్వామి గర్భాలయం, రెండోది యాగశాల అని తెలిపారు. రోజూ ఉదయం పూజ తరువాత దాన్ని మూసివేస్తారని, దాని పక్కనే దక్షిణ ఆగ్నేయంలో ఉన్న స్వామివారి పోటులోకి వంటవారు, అర్చకులు మినహా మరెవరూ వెళ్లేందుకు వీల్లేదని తెలిపారు. అయితే, ఇతరులకు ప్రవేశం లేని వంటశాల నుంచే నేలమాళిగలకు దారి ఉందన్న విషయం తేటతెల్లమవుతుందని రమణదీక్షితులు పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్‌ 8 న స్వామివారి లోపలి పోటును మూసేశారని, ఆ విషయం తనకు తెలిసి అడగడంతో నాలుగు రాతి బండలు పగిలాయని, కొద్ది రోజులు పోటు మూసివేశామని జేఈఓ శ్రీనివాసరాజు చెప్పినట్టు పేపర్లలో వచ్చిన విషయాన్ని దీక్షితులు గుర్తుచేశారు. స్వామి ప్రధానార్చకుడిగా, వైఖానస ఆగమశాస్త్ర సలహాదారుగా ఉన్న తనకు, మరో ముగ్గురు ప్రధానార్చకులకు తెలియకుండానే పోటు మూసివేయడం ఎలా జరిగిందని ప్రశ్నించారు. ఆ సమయంలో అన్న ప్రసాదాలు ఎక్కడ తయారు చేశారు? తదితర విషయాలు తనకు తెలియదని అన్నారు. అంతేకాదు ఎవరి సలహా తీసుకుని ఈ పని చేశారో తెలియదని విమర్శించారు. స్వామి గుప్త నిధుల కోసమే తవ్వకాలు జరిపారన్న తన ఆరోపణలపై సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. జరుగుతున్న అన్యాయాలను, తప్పులను ఎత్తి చూపినందుకే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. నాపై కక్ష తీర్చుకోడానికి రూ.100 కోట్ల మేర పరువు నష్టం దావావేయడం దారుణమన్నారు. ఇప్పటికైనా తన ఆరోపణలపై టీటీడీ స్పష్టమైన వివరణ ఇస్తే ప్రజల్లో ఉన్న సమస్యలకు సమాధానం దొరుకుతుందని రమణదీక్షితులు కోరారు.