ప్రియుడితో కలిసి .. కన్నతల్లిని హతమార్చిన కూతురు!


– చెడు అటవాట్లు మానుకోవాలని కూతుర్ని మందలించిన తల్లి
– హతమార్చి రైలుపట్టాలపై పడేసిన వైనం
– హత్యను తండ్రిపై నెట్టేందుకు యత్నించిన కూతురు
– నిలదీయడంతో తానే హతమార్చానని వెల్లడి
– విచారణ చేపట్టిన పోలీసులు
రంగారెడ్డి, అక్టోబర్‌28 జనం సాక్షి  :   చెడు అలవాట్లు మానుకోవాలని మందలించిన తల్లినేప్రియుడితో కలిసి  హతమార్చి తల్లీకూతుళ్ల బంధానికే మచ్చ తెచ్చింది ఓ కూతురు. పైగా తన తల్లి కనిపించటం లేదని, తండ్రిపైనే అనుమానాన్ని వ్యక్తంచేస్తూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తీరా గట్టిగా మందలించడంతో తానే హత్యచేశానని ఒప్పుకుంది. ఈ ఘటన హయత్‌నగర్‌లోని మునుగనూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రామన్నపేటకు చెందిన ప్లలెర్ల శ్రీనివాసరెడ్డి బతుకు దెరువు నిమిత్తం భార్య రజిత (38), కూతురు కీర్తితో కలిసి నగరానికి వలసవచ్చాడు. ప్రస్తుతం వీరు మునగనూరులో నివాసం ఉంటున్నారు. శ్రీనివాసరెడ్డి లారీ డ్రైవరుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా రజిత ఇంటివద్దే ఉంటూ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఈ క్రమంలో తమ కూతురు కీర్తి ఇద్దరు యువకులతో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నట్లుగా రజిత గుర్తించింది. ఇది మంచి పద్ధతి కాదంటూ కూతురిని మందలించింది. దీంతో తల్లిపై ద్వేషం పెంచుకున్న కీర్తి.. తండ్రి డ్యూటీకి వెళ్లిన సమయంలో ఆమెను కడతేర్చాలని భావించింది. ఈ నేపథ్యంలో ప్రియుడితో కలిసి పథకం రచించి తల్లిని హత్య చేసి.. మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకుని అతడితో పాటు అక్కడే మూడురోజుల పాటు గడిపింది. అయితే ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో ఎవరికైనా అనుమానం వస్తుందోమోనని భయపడి… ప్రియుడి సహాయంతో తల్లి మృతదేహాన్ని రామన్నపేట సవిూపంలోని రైలు పట్టాల విూద పడేసింది. అనంతరం తాను వైజాగ్‌ టూర్‌కు వెళ్తున్నానని తండ్రికి చెప్పి… ఇంటి వెనుకాలే ఉండే తన మరో ప్రియుడితో కీర్తి గడిపింది. అంతేకాకుండా తన తల్లి కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. తన తండ్రి తాగి రావడంతో కొన్నిరోజులుగా అమ్మానాన్నల మధ్య గొడవ జరుగుతోందని… ఈ నేపథ్యంలో విచారణ జరపాల్సిందిగా పోలీసులను కోరింది. కాగా డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన శ్రీనివాసరెడ్డి.. రజిత గురించి కీర్తిని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసుల విచారణలో భాగంగా తానే ప్రియుడితో కలిసి తల్లి రజితను హతమార్చినట్లు కీర్తి అంగీకరించినట్లు తెలిసింది. ఇక ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.