ఫసల్‌ బీమాతో రైతులకు లబ్ధి – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

 

దిల్లీ,జనవరి 13(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన్‌ మంత్రి ఫసల్‌ బీమా యోజన పథకంతో కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రకృతి వైపరిత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఈ పంట బీమా వల్ల ఎంతో మేలు కలిగిందన్నారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం ప్రారంభమై 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ట్విటర్‌లో ఈ విధంగా అభిప్రాయపడ్డారు.’ప్రకృతి వైపరిత్యాల వల్ల కలిగే నష్టాలనుంచి రైతులకు రక్షణ కలిగించే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ పథకం ద్వారా వ్యవసాయ ప్రాంతం బీమా పరిధిలోకి రావడం, నష్టాలను తగ్గించడంతో కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన రైతులందరికీ అభినందనలు’ అని ప్రధానమంత్రి మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇప్పటివరకు బీమా తీసుకోని రైతులు వెంటనే పంట బీమా చేయించుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఈ పథకం ద్వారా రైతులు ఎలా లబ్దిపొందారనే విషయాలను తెలుసుకునేందుకు నమో యాప్‌ ద్వారా వివరాలు పొందవచ్చని రైతులకు సూచించారు.పంట నష్టాలనుంచి రైతులను గట్టెక్కించే ఉద్దేశంతో 2016 ఖరీఫ్‌ సీజన్‌ నుంచి పీఎంఎఫ్‌బీవై పథకాన్ని ప్రారంభించారు. తొలుత రైతులు బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలు తీసుకునేటప్పుడు ఈ పథకంలో చేరాలని కచ్చితంగా చెప్పినప్పటికీ.. తర్వాత దీనిని ఐచ్ఛికంగానే మారుస్తూ కేంద్ర వ్యవసాయశాఖ నిర్ణయం తీసుకుంది.