బంగారం పేరుతో వ్యాపారికి టోకరా

రంగారెడ్డి,నవంబర్‌24(జ‌నంసాక్షి): తక్కువ ధరకే బంగారం అంటూ మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎం. కృష్ణ సింగ్‌ అనే వ్యక్తి తనను తానుగా శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ ఆఫీసర్స్‌ పరిచయం చేసుకునేవాడు. తనిఖీల్లో పట్టుబడ్డ బంగారం తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ చెప్పి ఓ వ్యాపారి వద్ద నుంచి రూ. 11 లక్షల నగదును తీసుకున్నాడు. శంషాబాద్‌కు చెందిన వ్యాపారికి ఈ నెల 11వ తేదీన బంగారం ఇస్తానని చెప్పి.. ఇవ్వకపోవడంతో వ్యాపారికి అనుమానం వచ్చింది. కృష్ణ సింగ్‌కు ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ రావడంతో వ్యాపారి తాను మోసపోయానని గమనించి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కృష్ణ సింగ్‌ మరో ఇద్దరిని ఇలాగే మోసంచేశాడని గుర్తించారు.