బంగారు తెలంగాణ దిశగా అభివృద్ది: ముత్తిరెడ్డి

జనగామ,ఆగస్ట్‌20 (జనం సాక్షి)  : సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయంగా ప్రభుత్వ ఫలాలు అందేలా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చి దిద్దాలన్న సంకల్పంతో సీఎం ముందుకు సాగుతున్నారన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్‌గా నిలుస్తోందని  అన్నారు. పార్టీలకతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు. అందులో భాగంగానే వ్యక్తిగతంగా కాకుండా  ప్రభుత్వ పథకాలు అర్హులకు అందించిన ఘనత ఈ ప్రభుత్వానిదన్నారు.అందుకే ప్రజలు సీఎం కేసీఆర్‌ పాలనకు బ్రహ్మరథం పట్టి స్వచ్ఛందంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నారని, అది చూసి జీర్ణించుకోలేని ప్రతిపక్ష పార్టీలు అర్థరహిత విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. పని చేసే నాయకులకే ప్రజలు పట్టం కడుతారని, ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. నాలుగేళ్ల తెలంగాణ ప్రభుత్వ హయాంలో కరంటు కోసం, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయంటూ, తాగునీరు, సాగునీరు, లోవోల్టేజీ, ఎరువులు దొరకడం లేదంటూ ఎక్కడా రోడ్డెక్కలేదన్నారు. ఉనికి కోసం ప్రతిపక్ష నాయకులు చౌకబారు ప్రకటనలు చేస్తున్నారని, వాటిని మానుకోవాలని సూచించారు. పొన్నాల లక్ష్మయ్య ఒక్క చెరువును నింపిన దాఖలా ఉందా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే దశలవారీగా గోదావరి జలాలతో అన్ని చెరువలు నింపుతున్నామన్నారు.