బండారు దత్తాత్రేయకు అవమానం

– నేట్టేసిన విపక్ష ఎమ్మెల్యేలు

సిమ్లా,ఫిబ్రవరి 26(జనంసాక్షి):హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో అనుచిత ఘటన చోటుచేసుకుంది. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తన ప్రసంగం ముగించుకుని వెళ్తుండగా పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆయన్ను నెట్టేశారు. దీనిపై అధికార భాజపా మండిపడింది. దీనికి కారణమైన నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్‌కు భాజపా తీర్మానం ప్రవేశపెట్టింది. గవర్నర్‌ను నెట్టేసిన ఘటనను హిమాచల్‌ సీఎం జైరాం ఠాకూర్‌ ఖండించారు.బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఉదయం గవర్నర్‌ దత్తాత్రేయ అసెంబ్లీకి హాజరయ్యారు. సమావేశం ప్రారంభం నుంచే కాంగ్రెస్‌ సభ్యులు నినాదాలు చేయడం మొదలు పెట్టారు. పెరిగిన గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై మాట్లాడాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో దత్తాత్రేయ ప్రసంగం చివరి వాక్యాలను చదివి తన ప్రసంగం పూర్తౌెనట్లుగా భావించాలంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించి నెట్టివేశారు. గవర్నర్‌ పట్ల అనుచితంగా వ్యవహరించిన వారిని సస్పెండ్‌ చేయాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేశ్‌ భరద్వాజ్‌ తీర్మానం ప్రవేశపెట్టగా స్పీకర్‌ వారిని సస్పెండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను ఆ పార్టీ ఖండించింది.