బంధువులు, మిత్రులకు కారుచౌకగా .. 

భూములు దారాదత్తం చేయడం నిజంకాదా?
– కేంద్రం విద్యాసంస్థలకు నిధులివ్వడం లేదని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు
– ఎస్‌సీఈఆర్‌టీకి భూమి ఎందుకు కేటాయించలేదో చెప్పాలి
– చంద్రబాబును లేఖద్వారా ప్రశ్నించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ
అమరావతి, సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి) : బంధువులు, మిత్రులకు చంద్రబాబు కారుచౌకగా భూములను దారాదత్తంచేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఈ మేరకు చంద్రబాబుకు లక్ష్మీనారాయణ ఐదు ప్రశ్నలు సంధించారు. టీడీపీ ప్రభుత్వ అక్రమాలపై గత కొన్ని వారాలుగా కన్నా బహిరంగ లేఖ ద్వారా చంద్రబాబును ప్రశ్నలు అడుగుతున్న సంగతి తెలిసిందే. బుధవారం కూడా ఐదు అంశాలపై లేఖద్వారా చంద్రబాబుకు ప్రశ్నలు సంధించారు. విశాఖపట్నం మధురవాడలో విూ కుమారుని మిత్రుడైన జి శ్రీధర్‌ రాజుకు 360 కోట్ల రూపాయల విలువైన భూమిని 25 కోట్ల రూపాయలకు కట్టబెట్టలేదా అని ప్రశ్నించారు. ఏపీఎల్‌ఎమ్‌ఏ, సర్వే నంబర్‌ 409లో ఉన్న భూమికి ఎకరం విలువ 7.26 కోట్ల రూపాయలుగా నిర్ణయిస్తే.. విూ కేబినెట్‌ దానిని 50 లక్షల రూపాయల ధర నిర్ణయించలేదా అని నిలదీశారు. ఇందులో విూకు, విూ కుమారునికి ముడుపులు అందలేదని చెప్పగలరా అని ప్రశ్నించారు. వ్యవసాయ రుణాలపై బ్యాంకులు వసూలు చేసే 7శాతం వడ్డీలో కేంద్రం తన 3శాతం చెల్లిస్తూండగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా 4శాతాన్ని గత నాలుగేళ్లుగా చెల్లించని మాట వాస్తవం కాదా అని కన్నా ప్రశ్నించారు. దీంతో బ్యాంకులు ఆమొత్తాన్ని పేద రైతుల నుంచి బలవంతగా వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా అని, ఆబకాయిలను ఎప్పటిలోగా చెల్లించి రైతులకు ఉపశమనం కలిగిస్తారని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. కృష్ణా జిల్లా జగయ్యపేట మండలం జయంతిపురం గ్రామంలో సర్వే నంబర్‌ 93లోని 499 ఎకరాల కోట్లాది రూపాయల విలువైన భూమిని కారుచౌకగా వీబీసీ ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌కు ధారదత్తం చేయలేదా అని చంద్రబాబును నిలదీశారు. ఆ కంపెనీ విూ బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకునికి చెందినది కాదా అని ప్రశ్నించారు. ఈ కేటాయింపులో అవకతవకలు జరగలేదని శ్వేత పత్రం విడుదల చేయగలరా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. కేంద్రం రాష్ట్రానికి విద్యాసంస్థలు ఇవ్వడం లేదని చెబుతున్న చంద్రబాబు.. 2016 డిసెంబర్‌లో కేంద్ర మంత్రులు శంకుస్థాన చేసిన ఎస్‌సీఈఆర్‌టీకి భూమి ఎందుకు కేటాయించలేదో ప్రజలకు చెప్పాలని లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం మేజర్‌ పోర్టుకు ఎప్పుడో రైట్స్‌ లిమిటెడ్‌ సంస్థ అనుకూలంగా రిపోర్టు ఇచ్చినా.. ప్రైవేటు రంగంలో మైనర్‌ పోర్టుకు ఎందుకు నిర్ణయం తీసుకున్నారో ప్రజలకు వివరించగలరా అని, వెనుకుబడిన ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేసే విషయంలో ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారని బీజేపీ ఏపీ
అధ్యక్షుడు లక్ష్మీనారాయణ లేఖద్వారా సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.