బర్త్‌ డే కేక్‌తిని తండ్రీ, కొడుకు మృతి

– అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లీ, బిడ్డ
– మెదక్‌ జిల్లాలో విషాద ఘటన
– బాబాయ్‌ శ్రీనివాసే కేక్‌లో విషం కలిపినట్లు అనుమానాలు
– అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు
మెదక్‌, సెప్టెంబర్‌5 (జనం సాక్షి ):  పుట్టినరోజు కేక్‌ తిని తండ్రీ కొడుకు మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం నింపింది. కొమురవెల్లి మండలం అయినాపూర్‌లో రమేష్‌(39) అనే వ్యక్తి భార్య భాగ్యలక్ష్మి(35), కూతురు పూజిత(12), కుమారుడు రామ్‌చరణ్‌(9)తో కలిసి నివాసముంటున్నాడు. బుధవారం కుమారుడు పుట్టిన రోజు కావటంతో కుటుంబమంతా ఆనందంగా గడిపింది. సాయంత్రం సమయంలో రామ్‌చరణ్‌ బర్త్‌డే కేక్‌ కట్‌ చేసి కుటుంబసభ్యులకు తినిపించి తానూ తిన్నాడు. కాసేపటికే వారంతా వాంతులు చేసుకున్నారు. తండ్రి, కొడుకు వాంతులు చేసుకొని స్పృహతప్పి పడిపోవటంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. రమేష్‌, రామ్‌చరణ్‌ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా. తల్లీకూతురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా చిన్నారి పూజిత తీవ్ర అస్వస్థతకు గురికావటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.  పుట్టిన రోజు సంతోషంలో విషాదఘటన చోటు చేసుకోవటంతో కుటుంబంలో తీరనిశోకం మిగిలింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు కేక్‌లో విషం కలవడం వల్లే వారు చనిపోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆ కేక్‌ను రమేశ్‌ తమ్ముడు శ్రీనివాస్‌ పంపించినట్లు తెలుస్తోంది. అన్నదమ్ములిద్దరికీ భూతగాదాలు నడుస్తున్నాయని, అన్న కుటుంబాన్ని అంతమొందించేందుకు అతడే కేక్‌లో విషయం కలిపి పంపించినట్లు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.