బస్‌ షెల్టర్‌ ను ఢీకొన్న కారు, ఐదుగురు మృతి

చింతపల్లి: నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద హైద్రాబాద్‌- నాగార్జున రాష్ట్ర రహదారిపై ఆదివారం తెల్లవారుజామున వాహనం అదుపుతప్పి బస్టాండ్‌ గోడకు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. నలుగురు ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతిచెందారు. వీరంతా హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం మరో విషాదం.

హైదరాబాద్‌ టోలిచౌకికి చెందిన ఐదు కుటుంబాటు విహారయాత్ర నిమిత్తం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నసర్లపల్లి వద్దకు చేరుకోగానే వాహనం అదుపుతప్పి బస్టాండ్‌ గోడను ఢీకొంది. వెనుక వస్తున్న వాహనాల్లోని వారు వెంటనే స్పందించి వారిని బయటకు తీశారు. అప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారిని హుటాహుటిన హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు. మృతులను హైదరాబాద్ టోలీచౌక్‌కు చెందిన ఎం.డి.మోహిన్, తమ్ము, ముస్తాఫా, సద్దాం, అక్తర్‌, ఆషాగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఎనిమిది మంది వరకు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. మూడు వాహనాల్లో ఐదు కుటుంబాలు విహార యాత్రకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని దేవరకొండ డీఎస్పీ రవికుమార్‌, నాంపల్లి సీఐ వెంకట్‌ రెడ్డి, చింతపల్లి ఎస్సై నాగభూషణ్‌ రావు పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.