బాబుని,కేసీఆర్ ను అరెస్టు చేయాల్సిందే:భట్టి..

వరంగల్: తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేయాలని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం వరంగల్ నగరంలోని మహేశ్వరీ గార్డెన్స్లో నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల సీఎంలుపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ్యులు, జడ్పీటీసీ, ఎంపీటీసీలను ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్నారని… అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీ టీడీపీ చెందిన ఎమ్మెల్యే రేవంత్తోపాటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు బేరసారాలు చేశారని భట్టి ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇద్దరిని అరెస్ట్ చేయాలన్నారు. వీరిద్దరి అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. నిబద్ధతతో కూడిన విచారణ జరగాలంటే ఇద్దరు ముఖ్యమంత్రులను పదవుల నుంచి తొలగించాల్సిందేనని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు