బాబు తనస్వార్థ రాజకీయాలకోసం 

శ్రీవారిని వాడుకుంటున్నాడు
– తెదేపా ప్రభుత్వం తిరుమలకు పట్టిన భూతం
– రమణ దీక్షితులపై చర్యలు ఎంతవరకు సమంజసం
– అర్చకులపై పెత్తనం చేయడానికి చంద్రబాబుకు అధికారం లేదు
– విలేకరుల సమావేశంలో వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి
హైదరాబాద్‌, మే17(జ‌నం సాక్షి) : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్ధ రాజకీయాలకు శ్రీవారి వెంకన్నను వాడుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి విమర్శించారు. ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..శ్రీవారి ఆలయం ఎప్పుడూ జరగని ఘోరాలు జరుగుతున్నాయని అర్చకులు ఆరోపిస్తున్నారని అన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల ఆరోపణలకు టీటీడీ సమాధానం చెప్పడం లేదని, తప్పును ప్రశ్నించిన రమణ దీక్షితులుపై చర్యలు ఎంతవరకు సమంజసమని భూమన ప్రశ్నించారు. రెండేళ్లు అధికారంలో ఉండేవారు.. ఏళ్ల నుంచి పూజలు చేసేవారిపై చర్యలు తీసుకుంటారా అని ఆయన ధ్వజమెత్తారు. అర్చకులపై పెత్తనం చేయడానికి చంద్రబాబుకు అధికారం లేదని, కలియుగ వైకుంఠాన్ని నరకంగా మారుస్తున్న చరిత్ర చంద్రబాబుది అని ఆరోపించారు. బాబు పాలనలో విజయవాడ చుట్టూ దాదాపుగా 45 దేవాలయాలు కూల్చేశారని, సీఎం తన ఉక్కుపాదాల్ని బ్రాహ్మణులపై మోపుతున్నారన్నారు. చంద్రబాబు పాలన అవినీతి, నేరాలు, ఘోరాలతో సాగుతుందని భూమన దుయ్యాబట్టారు. విజయవాడ దుర్గ గుడిలో ఎలాంటి పూజలు జరిగాయో.. అలాంటివే శ్రీవారి ఆలయంలో జరుగుతున్నాయని అర్చకులు చెబుతారనే తీసేశారని పేర్కొన్నారు.
వెంకన్నతో పెట్టుకున్న కొద్దిరోజులకే అలిపిరి ఘటన జరిగిందని ఆయన గుర్తుచేశారు. శ్రీవారి ఆలయానికి పట్టిన భూతం చంద్రబాబు ప్రభుత్వం భూమన విమర్శించారు. ఆలయ భూమాలను చౌకగా కొట్టేసిన చరిత్ర చంద్రబాబుదిని ధ్వజమెత్తారు. అర్చక వ్యవస్థలో చంద్రబాబు తలదూర్చి.. హిందూ సంప్రదాయాలకు ఘోరాతి ఘోరం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలోనే 1000 కాళ్ల మండపాన్ని కూల్చేశారని, వారసత్వాలు సంప్రదాయాలపై  దాడి సరికాదని భూమన హితవు పలికారు. హిందూత్వంపై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఘోరాలపై ఉద్యమించే సమయం ఆసన్నమైందని భూమన కరుణాకర్‌ రెడ్డి తెలిపారు.