బాబు ప్రయత్నాలు.. వినోదాలు పంచుతున్నాయి

– డూప్లికేట్‌ తాళంచెవితో అధికారం తలుపు తెరవాలనుకుంటున్నారు
– ఏపీ సీఎం చంద్రబాబుపై శివసేన సెటైర్లు
న్యూఢిల్లీ, మే20(జ‌నంసాక్షి) : ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వేదికగా చేస్తున్న కూటమి ప్రయత్నాలు చూస్తుంటే వినోదాలు పంచుతున్నాయని శివసేన పార్టీ సెటైర్లు వేసింది. తన అధికార పత్రిక ‘సామ్నా’లో ప్రచురించిన సంపాదకీయంలో చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు విసిరింది. రుతుపవనాలు అండమాన్‌ ను తాకి అందరికీ ఆనందం కలిగిస్తున్నాయని, అలాగే చంద్రబాబు.. ఢిల్లీలో చేస్తున్న ప్రయత్నాలు వినోదాలు పంచుతున్నాయని ఎద్దేవా చేసింది. నరేంద్ర మోడీ తిరిగి ప్రధాని అవుతారని ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు చెబుతున్నాయని పేర్కొంది. కానీ చంద్రబాబు డూప్లికేట్‌ తాళం చెవితో అధికారం తలుపు తెరవాలని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబే స్వయంగా ఆంధప్రదేశ్‌ లో ఓడిపోబోతున్నారని రాసుకొచ్చింది. ఇక శ్మశానంలో బూడిదనంతా పోగు చేసినట్టుగా చంద్రబాబు ప్రయత్నాలు ఉన్నాయంటూ ఎద్దేవా చేసింది శివసేన పార్టీ… నిజంగా విపక్షాల ఏకత అనేది ఫలితాల తర్వాత తేలుతోందని పేర్కొంది. ఐదు మంది విపక్షాలు… ఐదు మంది తామే ప్రధానమంత్రి అభ్యర్థి అని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించిన ‘సామ్నా’ సంపాదకీయం… బీజేపీ 300 సీట్లకు పైగా గెలుస్తుందని అమిత్‌ షా  ముందుగానే ప్రకటించారని పేర్కొంది. అయినా, చంద్రబాబు వ్యర్థ  ప్రయత్నాలు చేయడం మానలేదని శివసేన తన సామ్నాపత్రికలో ఎద్దేవా చేసింది. కాగా బీజేపీయేతర పార్టీలను ఏకంచేసే పనిలో ఉన్న చంద్రబాబు.. సోమవారం కోల్‌కతా వెళ్లి మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు… ఎన్డీయేతర పక్షాల్లోని పలువురు నేతలతో భేటీ అయ్యారు.