బాల్‌రెడ్డి మృతి పట్ల అసెంబ్లీ సంతాపం

హైదరాబాద్‌, ఫిబ్రవరి25(జ‌నంసాక్షి) : బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి మృతి పట్ల అసెంబ్లీ సంతాపం వ్యక్తం చేసింది.  సోమవారం ఈ మేరకు సంతాప తీర్మానాన్ని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి చదివి వినిపించారు. బాల్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. 1962లో బాల్‌రెడ్డి జనసంఘ్‌లో చేరి.. క్రియాశీల రాజకీయాలకు శ్రీకారం చుట్టారని స్పీకర్‌ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారని తెలిపారు. 1985 నుంచి మూడు పర్యాయాలు కార్వాన్‌ నియోజవర్గానికి పనిచేశారని వెల్లడించారు. అణగారిన వర్గాలకు నిస్వార్థ సేవలు అందించారన్నారు. ఎస్సీ, ఎస్టీల పురోగతికి ఎంతో కృషి చేశారన్నారు. వీరు పలు సామాజిక సంస్థలకు, కార్మిక సంఘాలకు సలహాదారుగా సేవలందించారని పోచారం తెలిపారు. తమ నియోజక అభివృద్ధికి ఎనలేని సేవలందించారని కొనియాడారు.