బిజెపి రాజకీయాలను ప్రజలు ఆమోదించరు: టిఆర్‌ఎస్‌

కరీంనగర్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): అధికారదాహం కోసం విమోచన దినాన్ని బీజేపీ స్వార్ధ రాజకీయాల కోసం వాడుకుంటుందని టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌ రెడ్డి ఆరోపించారు. నిజాంరాజును పొగడ్తలతో అప్పటి కేంద్రం బిరుదులను ఇచ్చిన విషయాన్ని మార్చిపోయారని ప్రశ్నించారు.విమోచనదినం పేరిట తెలంగాణలో హిందూ, ముస్లిముల మధ్య బీజేపీ చిచ్చుకు యత్నిస్తోందని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆరోపించారు. తెలంగాణలో అల్లకల్లోలం చేసి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ¬దా సాధించాలని డిమాండ్‌ చేశారు. స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేసిన మిషన్‌ భగీరథకు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. హైకోర్టును విభజించకుండా కేంద్రం తాత్సారం చేస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ బంగాఖాతంలో కలవడం ఖాయమని అన్నారు. విమోచన యాత్రల పేరుతో ప్రశాంతంగా ఉన్న తెలంగాణ అల్లర్లకు దారితీయాలని కోరుకుంటోందని అన్నారు. దీనిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బీజేపీని తరిమికొట్టే రోజులో దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. తెలంగాణలో అన్ని మతాల వారు కలిసి మెలిసి ఉంటున్నారని, సీఎం కేసీఆర్‌ అన్నివర్గాల వారికి సమ న్యాయం చేస్తున్నారని తెలిపారు. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్ట్‌కు జాతీయ ¬దా ప్రకటించకుండా కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. గత ప్రభుత్వాలు చెరువుల నిర్వహణను విస్మరించాయని, సీఎం కేసీఆర్‌ మిషన్‌ కాకతీయ ప్రవేశపెట్టి వేలాది చెరువులు పునరుద్ధరించి పూర్వ వైభవం కల్పించినట్లు తెలిపారు.