బీజేపీ పతనం ప్రారంభమైంది

మిత్రపక్షాలన్నీ దూరమవుతున్నాయి

పూర్వ వైభవం కోసం సినీ నటులను అమిత్‌షా ఆశ్రయిస్తున్నారు

బీజేపీ వ్యతిరేఖ శక్తులన్నింటిని సీపీఐ ఏకం చేస్తుంది

ఫెడరల్‌ఫ్రంట్‌తో కేసీఆర్‌ శిఖండి పాత్ర పోషిస్తున్నాడు

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కేసీఆర్‌ ఎందుకు మాట్లాడటం లేదు

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

నిజామాబాద్‌, జూన్‌14(జ‌నం సాక్షి) : దేశంలో బీజేపీ పతనం ఆరంభమైందని వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గద్దదించేందుకు సిద్ధంగా ఉన్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.గురువారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ పతనం ప్రారంభమయిందని జోష్యం చెప్పారు. ఇందుకు నిదర్శనం ఇటీవల జరిగిన ఎన్నికలే అని ఆయన పేర్కొన్నారు. బీజేపీకి మిత్ర పక్షాలు దూరమవుతున్నాయని తెలిపారు. ‘పూర్వ వైభవం కోసం సినీ నటి మాధురీదీక్షిత్‌ లాంటి వారి సహకారాన్ని కోరడం ద్వారా రానున్న ఎన్నికల్లో ఓటమి తథ్యమని నిరూపించుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశానికి చివరి నిమిషంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వెళ్లడం అవకాశవాదమే నన్నారు. ప్రభుత్వం వల్లే ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతోందని, బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక శక్తులన్నింటిని సీపీఐ ఏకం చేస్తుంద’ని నారాయణ తెలిపారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు శిఖండి పాత్ర పోషిస్తున్నారని నారాయణ ధ్వజమెత్తారు. ‘ఫెడరల్‌ ఫ్రంట్‌ అనేది ఎన్డీయేకు బీ ఫ్రంట్‌. బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు వ్యతిరేకంగా అందర్నీ సవిూకరిస్తున్నామన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్రం చెబుతుందని, దీనిపై కేంద్రం విూద కేసీఆర్‌ ఎందుకు ఒత్తిడి చేయడం లేదదని నారాయణ ప్రశ్నించారు. కేసీఆర్‌కు దమ్ముంటే కేంద్రంపై పోరాడాలని, బాంచెన్‌ దొర అంటూ కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాళ్ల వద్ద మోకరిల్లుతున్నారని విమర్శించారు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని రైతులను ఆదుకోవాలని, కాళేశ్వరం పేరు చెప్పి ఓట్లు పొందుదామనుకోవడం భ్రమేనని నారాయణ పేర్కొన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ పడిపోతుందని, తెలంగాణను వ్యతిరేకించిన వారు క్యాబినెట్‌లో ఉన్నారని నారాయణ ధ్వజమెత్తారు.