బుజ్జగింపులకు లొంగని కాంగ్రెస్‌ నేతలు

 

క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌కు తలనొప్పులు

హైదరాబాద్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): : దాదాపు నెల రోజులపాటు తీవ్ర కసరత్తు నిర్వహించి ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ అధికారిక అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో కార్యకర్తల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు కొన్నిచోట్ల తిరుగుబాటుచేస్తూ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగగా, మరికొన్నిచోట్ల అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌

నేతల విషయానికొస్తే, ఇన్నిరోజులూ టికెట్ల సాధనకోసం ఢిల్లీస్థాయిలో పైరవీలుచేసి ఎట్టకేలకు సఫల మైతే, ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు వారికి తల నొప్పిగా మారాయి. ప్రముఖ నేతలను స్వయంగా ఢిల్లీ స్థాయి నేతలే బిజ్జగించినప్పటికీ పరిస్థితిలో చెప్పుకోదగ్గ మార్పు రాలేదు. భంగ పాటుకు గురైన నేతల అనుచరగణం ప్రచారానికి రాకుండా ముఖం చాటేస్తోంది. దీంతో కాంగ్రెస్‌ అధిష్టానం నియోజకవర్గాల వారీగా అసంతృప్తి నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేపట్టింది. అయితే వారి బుజ్జగింపులకు నేతలు మెత్తబడకపోవడం పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. గ్రేటర్‌లోని 24 నియాజకవర్గాలకుగాను కాంగ్రెస్‌ పార్టీనుంచి 16మంది బరిలోకి దిగగా, ఆరు స్థానాలు టీడీపీకి, రెండు జనసమితికి కేటాయించారు. అన్నిచోట్లా టికెట్లు ఆశించి భంగపడిన నేతల నుంచి అధికారిక అభ్యర్థుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. ముఖ్యంగా శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, సికింద్రాబాద్‌, యాకత్‌పురా, కంటోన్మెంట్‌, ఖైరతాబాద్‌, ఉప్పల్‌ తదితర స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ముఖ్యంగా రాజేంద్రనగర్‌ స్థానం నుంచి కార్తీక్‌రెడ్డి, శేరిలింగంపల్లి నుంచి భిక్షపతియాదవ్‌, సికింద్రాబాద్‌ స్థానం నుంచి బండ కార్తీకరెడ్డి, ఖైరతాబాద్‌బాద్‌ నుంచి రోహిన్‌రెడ్డి, కంటోన్మెంట్‌ నుంచి గణెళిష్‌, యాకత్‌పురనుంచి ఆబిద్‌ రసూల్‌ ఖాన్‌ తదితరులు నామినేషన్లు దాఖలుచేశారు. గత కొంతకాలంగా వీరు క్షేత్రస్థాయిలో పోటీచేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసుకోగా, ఇప్పుడు సీట్ల వ్యవహారం తేలిపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉండాలని నిర్ణయించుకున్నారు. టీడీపీ, జనసమితికి కేటాయించిన సీట్లలో సైతం కాంగ్రెస్‌ భంగపడ్డ నేతలనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎదురీదక తప్పని పరిస్థితి ఏర్పడింది. సోమవారం నామినేషన్లకు చివరిరోజు కావడంతో కాంగ్రెస్‌ పార్టీకిచెందిన చోటామోటా నేతలుసైతం పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలుచేశారు. అయితే వీరు బరిలో ఉంటారా, లేదా, బుజ్జగింపులు ఏ మేరకు ఫలితాలిస్తాయనే మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే వీలుంది.