బుల్లితెర నటుడు  కుశాల్‌ పంజాబీ ఆత్మహత్య

ముంబయి,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): ‘ఇష్క్‌ మైనే మార్జవాన్‌’ ధారవాహికతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న కుశాల్‌ పంజాబీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం కుశాల్‌ ముంబయిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కుశాల్‌ మృతితో భావోద్వేగానికి గురైన ఆయన స్నేహితుడు కర్ణవీర్‌ బోహ్రా ట్విటర్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. ‘నువ్వు మృతి చెందావనే వార్త నన్ను నరకంలోకి తీసుకువెళ్లింది. ఇప్పటికీ నేను ఆ వార్తను నమ్మలేక పోతున్నాను. సంతోషమైన జీవితాన్ని గడుపుతున్న నువ్వు ఇలా ఎందుకు చేశావో అర్థం కావడం లేదు. జీవితాన్ని చూసే కోణంలో ప్రతిసారి నన్ను ఎంతగానో ఇంప్రెస్‌ చేశావు. ఒక డ్యాన్సింగ్‌డాడీగా ఎప్పటికీ నిన్ను గుర్తుపెట్టుకుంటాను.’ అని కర్ణవీర్‌ పేర్కొన్నారు. కర్ణవీర్‌ పెట్టిన పోస్ట్‌పై స్పందించిన పలువురు నటీనటులు, నెటిజన్లు.. కుశాల్‌ మృతి పట్ల షాక్‌కు గురయ్యారు. నటి శ్వేత తివారీ.. ‘వాట్‌.. ఓ మైగాడ్‌.. ఎప్పుడు? ఎలా?’ అని కామెంట్‌ పెట్టగా.. ‘వాట్‌? ఇది ఎప్పుడు జరిగింది. ఇది నిజంగానే చాలా బాధకరమైన విషయం. నేను నమ్మలేకపోతున్నాను. అతని ఆత్మకు శాంతి చేకూరాలి.’ అని వికాస్‌ కలాంత్రి అనే నటుడు తెలిపారు.