బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌

అనంతపురం,మే23( జ‌నం సాక్షి):  ఐపీఎల్‌ సందర్భంగా అనంతపురంలో బెట్టింగ్‌ రాయుళ్లు విజృంభిస్తున్నారు. పోలీసులు వీరిని ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్నా… కొందరు యువకలు బెట్టింగ్‌ మోజులో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. తాజాగా మంగళవారం రాత్రి చెన్నై సూపర్‌ కింగ్స్‌, హైదరాబాద్‌ సన్‌ రైజర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌పై బెట్టింగ్‌ నిర్వహిస్తున్న 12మందిని మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. రాజీవ్‌ కాలనీతో పాటు పలు కాలనీలకు చెందిన యువకులు బెట్టింగ్‌ ఆడుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. వీరి నుంచి లక్షా 50వేల నగదు, 12సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి 40మందిని బైండోవర్‌ చేసి పలు చోట్ల దాడులు చేసి సుమారు అర కోటి వరకు నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెంకట్రావు తెలిపారు. బెట్టింగ్‌ ఆడితే సులభంగా డబ్బులు వస్తాయన్న ఆశతో యువకులు ఈ జూదంలో దిగి జీవితాలను నాశనం చేసుకోవద్దని డీఎస్పీ సూచించారు.