బౌలింగ్‌ విభాగం పటిష్ఠంగా ఉంది

– మూడో టెస్ట్‌ లో బ్యాట్స్‌మెన్‌లదే బాధ్యత
– టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి దిశానిర్ధేశం
మెల్‌బోర్న్‌ , డిసెంబర్‌25(జ‌నంసాక్షి) : గత రెండు టెస్ట్‌ లలో బౌలింగ్‌ విభాగంలో భారత్‌ పటిష్ఠంగా ఉందని, ఆస్టేల్రియాతో మంగళవారం నుంచి జరిగే మూడో టెస్ట్‌ లో జరిగే బాక్సింగ్‌డే టెస్ట్‌లో బ్యాట్స్‌మెన్‌ రాణించాల్సిందేనని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నారు. నేటి నుండి మూడో టెస్ట్‌ ఆరంభంకానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోహ్లి విూడియాతో మాట్లాడుతూ.. ఈ సారి  బ్యాట్స్‌మెన్‌ రాణించడం ఎంతో ముఖ్యమని, బౌలింగ్‌ విభాగం అద్భుతంగా రాణిస్తుందన్నారు. చిన్న టార్గెట్‌లను కూడా చేధించకపోతే  బౌలర్స్‌ ఏం చేయలేరని, ఒక వేళ సెకండ్‌ బ్యాటింగ్‌ చేయాల్సి వస్తే.. ఆధిక్యం కోసం ప్రయత్నించాలన్నారు. లేకుంటే కనీసం ఆ స్కోర్‌ను సమం చేయడానికైనా కృషి చేయాలని కోహ్లీ అన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో గెలపుకోసం ప్రయత్నించాలని, తొలుత బ్యాటింగ్‌ చేస్తే మాత్రం భారీ స్కోర్లు సాధించి విజయావకాశాలను అందిపుచ్చుకోవాల్సి ఉంటుందని, దీనికోసం బ్యాట్స్‌మెన్‌ అంతా కలిసికట్టుగా రాణించాల్సిన అవసరం ఉందన్నారు. ఏ ఒక్కరో రాణించాలని చెప్పడం లేదని, అందరూ ఐక్యంగా పరుగులు చేయాల్సిందేనని భారత ఆటగాళ్లకు కోహ్లి దిశానిర్ధేశం చేశాడు. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే చెరొకటి గెలిచిన ఇరు జట్లు మూడో టెస్ట్‌ విజయంపై దృష్టిసారించాయి. ఎలాగైన విజయం సాధించి సిరీస్‌లో పైచేయి సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే బ్యాటింగ్‌ వైఫల్యం కారణంగానే భారత్‌ రెండో టెస్ట్‌లో పరాజయం పాలైంది. స్వల్ప టార్గెట్‌లను కూడా చేధించలేక బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న టీమ్‌మేనేజ్‌మెంట్‌ జట్టులో మార్పులు చేసింది. దారుణంగా విఫలమైన ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, మురళీ విజయ్‌లను పక్కకు పెట్టింది. ఉన్నపళంగా  కర్ణాటక బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ అగర్వాల్‌ను రప్పించి తుది జట్టులో అవకాశం కల్పించింది. గత రెండు టెస్ట్‌ల్లో ఆరంభం సరిగ్గా లేక భారత బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం చెందారు. దీంతో రంజీల్లో అదరగొట్టిన మయాంక్‌ అగర్వాల్‌, హనుమ విహారిలను ఓపెనర్లుగా పంపించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.