బ్రిటన్‌ భయకంపితం

– కరోనా కొత్త స్ట్రేయిన్‌తో గజగజ

– బ్రిటన్‌ విమానసర్వీసులు రద్దు

న్యూఢిల్లీ,డిసెంబరు 21 (జనంసాక్షి): కరోనా వైరస్‌ తిప్పలు ప్రజలకు ఇంకా తప్పడం లేదు. ఇప్పటివరకూ ఉన్న కరోనా వైరస్‌ వల్ల సంవత్సర కాలంలో 7 కోట్ల మందికి పైగా వ్యాధి బారిన పడ్డారు. ఏడాదిగా పీడిస్తున్న ఈ మహమ్మారి తలలు వంచేందుకు ఇప్పటికీ సరైన వ్యాక్సిన్‌ జనజీవనంలోకి అడుగుపెట్టలేదు. ఇప్పడిప్పుడే కోవిడ్‌ తీవ్రత నుంచి ఊపిరి పీల్చుకుంటున్న జనాలను బ్రిటన్‌లో వెలుగు చూసిన ఓ కొత్త రకం కరోనా వైరస్‌ మళ్లీ వణుకు పుట్టిస్తోంది. ఈ కొత్త వైరస్‌ కరోనా వైరస్‌ కంటే వేగంగా వ్యాపిస్తోంది. దీనివల్ల బ్రిటన్‌లో పరిస్థితి చేయి దాటి పోవడంతో లండన్‌తోపాటు ఆగ్నేయ ఇంగ్లండ్‌లో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. కరోనా వ్యాక్సిన్‌ దేశమంతా సప్లై అయ్యే వరకూ కొన్ని నెలలపాటూ నిబంధనలు కొనసాగుతాయని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆదేశించారు . క్రిస్‌మస్‌ సంబరాలను సైతం రద్దు చేస్తూ ఇంట్లోనే ఉండాలని సూచించారు. చదవండి: యూరప్‌ను వణికిస్తున్న కరోనా కొత్త రూపంఅదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు యూకే నుంచి విమానాల రాకపోకలను నిషేధించాయి. బ్రిటన్‌ నుంచే వచ్చే విమానాలపై నిషేధం విధించాలని ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్రాన్ని కోరారు. బ్రిటన్‌లో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ కొత్త మ్యుటేషన్‌ సూపర్‌ స్ప్రెడర్‌లా ఉందని సోమవారం (డిసెంబర్‌ 21) ఆయన ట్వీట్‌ చేశారు. తక్షణమే ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని కేజ్రీవాల్‌ కోరారు. కాగా ఫ్రాన్స్‌ రోడ్డు, వాయు, సముద్రం, రైలు ద్వారా వస్తువుల రవాణాకు సంబంధించిన ప్రయాణాలతో సహా ఆదివారం అర్ధరాత్రి నుంచి 48 గంటల వరకు బ్రిటన్‌ నుంచి వచ్చే అన్ని ప్రయాణాలను నిలిపివేస్తామని ఫ్రాన్స్‌ ఆదివారం తెలిపింది. జర్మనీ ఆదివారం నుంచి బ్రిటన్‌ నుంచి అన్ని సంబంధాలను ఆపేస్తున్నట్లు పేర్కొంది. ఇది ప్రస్తుతానికి డిసెంబర్‌ 31 వరకు కొనసాగుతందని పేర్కొంది. కార్గో విమానాలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఇటీవలే బ్రిటన్‌ నుంచి తిరిగి వచ్చిన ఇటలీలో ఒక వ్యక్తిలో కొత్త వైరస్‌ కనుగొన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐర్లాండ్‌ ఆదివారం అర్ధరాత్రి నుంచి బ్రిటన్‌ నుంచి వచ్చే అన్ని విమానాలను కనీసం 48 గంటలు నిషేధించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.కెనడా కొత్త కరోనా వైరస్‌ వల్ల యూకే నుంచి అన్ని విమానాలను 72 గంటలు నిషేధిస్తున్నామని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చెప్పారు.నెదర్లాండ్‌ బ్రిటన్‌ నుంచి నెదర్లాండ్స్‌కు వెళ్లే అన్ని ప్రయాణీకుల విమానాలను జనవరి 1 వరకు నిషేధించినట్లు డచ్‌ ప్రభుత్వం తెలిపింది. బెల్జియం యూకే నుంచి బెల్జియంకు వెళ్లే అన్ని విమాన, రైలు ప్రయాణాలను ఆదివారం అర్ధరాత్రి నుంచి కనీసం 24 గంటలు నిలిపివేస్తామని ప్రధాని అలెగ్జాండర్‌ చెప్పారు. ఆస్ట్రియా బ్రిటన్‌ నుంచి ప్రయాణ నిషేధానికి వియన్నా వివరాలు రూపొందిస్తున్నట్లు ఆస్ట్రియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రెస్‌ ఏజెన్సీ ఏపీఏకు తెలిపింది.స్వీడన్‌ బ్రిటన్‌ నుంచి ప్రజలు ప్రవేశించడాన్నినిషేధించడానికి దేశం సిద్ధమవుతోందని సోమవారం అధికారికంగా పేర్కొంది.. ఫిన్లాండ్‌ సోమవారం మధ్యాహ్నం నుంచి రెండు వారాల పాటు యూకే నుంచి ప్రయాణీకుల విమానాలను ఫిన్లాండ్‌లో ల్యాండ్‌ చేయడానికి అనుమతించరని రవాణా లైసెన్సింగ్‌ ఏజెన్సీ ట్రాఫికామ్‌ ఆదివారం ఆలస్యంగా ప్రకటించింది.స్విట్జర్లాండ్‌ బ్రిటన్‌, దక్షిణాఫ్రికా నుంచి విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు స్విట్జర్లాండ్‌ ఆదివారం తెలిపింది అలాగే బాల్టిక్స్‌ బల్గేరియా టర్కీ ఇరాన్‌ రొమేనియా ఇజ్రాయిల్‌, సౌదీఅరేబియా క్రొయేషియా ఉన్నాయి.

యూకే విమానాలు రద్దు

– అప్రమత్తమైన భారత్‌)

న్యూఢిల్లీ,డిసెంబరు 21 (జనంసాక్షి):బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. యూకే నుంచి వచ్చే విమానాలపై తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ నెల 22వ తేదీ రాత్రి 11.59 గంటల నుంచి డిసెంబర్‌ 31 రాత్రి 11.59 గంటల వరకు యూకే నుంచి వచ్చే విమానాలకు అనుమతి లేదు అని కేంద్ర విమానయాన శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఫ్రాన్స్‌, జర్మనీ, బెల్జియం, కెనడా, ఇటలీ, ఆస్ట్రియా వంటి దేశాలు యూకే నుంచి వచ్చే విమానాలను నిషేధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూకే నుంచి వస్తున్న విమానాల్లో ఉన్న ప్రయాణికులకు ముందు జాగ్రత్త చర్యగా ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్‌ను తప్పనిసరి చేసినట్లు కూడా విమానయాన శాఖ వెల్లడించింది. ఇప్పటికే యూకే నుంచి బయలుదేరిన విమానాలు లేదా డిసెంబర్‌ 22, రాత్రి 11.59 గంటలలోపు వచ్చే విమానాల్లో ప్రయాణికులకు ఈ టెస్ట్‌ను తప్పనిసరి చేశారు.

అలర్ట్‌గా ఉన్నాం.. ఆందోళన వద్దు

బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ సోమవారం స్పందించారు. ప్రభుత్వం అలెర్ట్‌గా ఉన్నదని, ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. యూకేలోని కొత్త రకం వైరస్‌పై శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని ఆయన చెప్పారు. ఊహాజనిత పరిస్థితులు, వివరణలు చూసి భయపడిపోవద్దు. ఇక్కడ మరీ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. అయితే మన సైంటిస్టులు మాత్రం ఎప్పటికప్పుడు ఈ కొత్త రకం వైరస్‌ గురించి తెలుసుకుంటూనే ఉన్నారు అని హర్షవర్ధన్‌ తెలిపారు. యూకేలో వెలుగుచూసిన ఈ కొత్త రకం వైరస్‌పై చర్చించడానికే సోమవారం జాయింట్‌ మానిటరింగ్‌ గ్రూప్‌తో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. బ్రిటన్‌లో కనిపించిన ఈ కొత్త రకం కరోనా వైరస్‌ అంతకుముందు వైరస్‌ కంటే చాలా వేగంగా వ్యాపిస్తోంది. దీంతో లండన్‌తోపాటు ఆగ్నేయ ఇంగ్లండ్‌లో మరోసారి లాక్‌డౌన్‌ విధించారు. పరిస్థితి చేయి దాటిపోయిందని అక్కడి ఆరోగ్య మంత్రి హాంకాక్‌ చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా దేశాలు యూకే నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి.