భక్తిసాగరంలో ముంచెత్తిన అన్నమయ్య సంకీర్తనలు

తిరుపతి,నవంబర్‌17(జ‌నంసాక్షి): శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర¬్మత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. సాయంత్రం వేళ సుమధురంగా కార్యక్రమాలు సాగుతున్నాయి. గురువారం సాయంత్రం తిరుచానూరులోని ఆస్థానమండపంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డిప్యూటీ ఈవో మునిరత్నంరెడ్డి, టిటిడి ఉద్యోగి సి.బాలసుబ్రమణ్యం కలిసి ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు, ఎస్వీ సంగీత నృత్య కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సాంస్క తిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా తిరుచానూరులోని ఆస్థాన మండపంలో సాయంత్రం అన్నమయ్య విన్నపాలు కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. ‘చూడరమ్మ సతులారా….’, ‘ఏమని పొగడుదమే….’, ‘క్షీరాబ్ది కన్యకకు….’, ‘కులుకగ నడవరు….’, ‘విచ్చేయవమ్మా…’ తదితర సంకీర్తనలను టిటిడి అధికారులు రాగభావయుక్తంగా ఆలపించారు. ఇదిలా ఉండగా ఆస్థానమండపంలో ఉదయం ఎస్‌.వి.సంగీత కళాశాల అధ్యాపకులతో మంగళధ్వని, ధర్మగిరిలోని శ్రీవేంకటేశ్వర వేదపాఠశాల ఆధ్వర్యంలో వేద పారాయణం నిర్వహించారు. చెన్నైకి చెందిన ఆచార్య సి.నమ్మాళ్వార్‌ ధార్మికోప న్యాసం, శ్రీమతి రూపశ్రీ రాజగోపాలన్‌ బృందం భక్తి సంగీతం, రాత్రి ఊంజల్‌ సేవలో శ్రీమతి కె.శివరత్నం బృందం సంకీర్తనాలాపన చేపట్టారు. అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు శ్రీ ఎ.శబరిగిరీష్‌ బృందం గాత్ర సంగీతం, రాత్రి వరకు తిరుపతికి చెందిన శ్రీ ఇ.నాగసాయి మేఘన బృందం భరతనాట్య కార్యక్రమం, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం చెన్నైకి చెందిన శ్రీ జి.అభిలాష్‌ బృందం భక్తి సంగీతం ఆకట్టుకున్నాయి.