భగ్గుమన్న కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు 

– యెడ్డీ ప్రమాణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నిరసన
– విధానసౌద ఎదుట నిరసన తెలిపిన కాంగ్రెస్‌ నేతలు
– భాజపాయేతర పక్షాలు మాతో కలిసిరావాలి
– జేడీఎస్‌ శాసనసభాపక్ష నేత కుమారస్వామి
బెంగళూరు, మే17(జ‌నం సాక్షి) : కన్నడ నాట క్షణం క్షణం మారుతున్న రాజకీయాలతో ఉత్కంఠత నెలకొంది. గత రెండు రోజులుగా తీవ్ర స్థాయిలో సాగిన ఉత్కంఠతకు కొద్దిగా తెరదించుతూ గవర్నర్‌  బీజేపీ నేత, మాజీ సీఎం యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు భగ్గుమన్నారు. గవర్నర్‌ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, నేతలు కర్ణాటక విధానసౌధ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు గులాం నబీ ఆజాద్‌, అశోక్‌ గెహ్లాట్‌తోపాటు మాజీ సీఎం సిద్దరామయ్య ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు
మాట్లాడుతూ బీజేపీ అసంబద్ధ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. పూర్తిమెజార్టీ కాంగ్రెస్‌, జేడీఎస్‌లకు ఉన్నా తమను ప్రభుత్వ నిర్వహణకు ఆహ్వానించకుండా మెజార్టీ లేని బీజేపీని ప్రభుత్వ ఏర్పాటు గవర్నర్‌ నిర్ణయించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఖార్గే మాట్లాడుతూ.. తాత్కాలిక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప రుణమాఫీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం నిలవదని, అవిశ్వాస తీర్మానంలో తామే నెగ్గుతామని స్పష్టం చేశారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి సిద్ది రామయ్య మాట్లాడుతూ.. ప్రస్తుతం యడ్యూరప్ప ప్రమాణ స్వీకార అంశం సుప్రీంకోర్టు ఎదుట పెండింగ్‌లో ఉందని, బీజేపీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తోందన్నారు. మేం ప్రజల్లోకి వెళ్లి ఈ విషయాన్ని చాటుతామని పేర్కొన్నారు.