భర్త చితితోపాటు తాను కాలిబూడిదైన భార్య..

ముంబై: మరోసారి సతీసహగమనాన్నితలపించే దృశ్యం ఆవిష్కృతమైంది. చనిపోయిన భర్త చితికి నిప్పంటించిన అనంతరం కనిపించకుండా పోయిన భార్య.. భర్తతోపాటు తాను కాలిబూడిదై పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే, ఆమెతో భర్త కుటుంబ సభ్యులు సతీసహగమన చర్యకు పాల్పడేలా చేశారా అని పోలీసులు అనుమానిస్తున్నారు. తుకారాం అనే వ్యక్తి (55) గుండెపోటుతో ఆదివారం సాయంత్ర చనిపోయాడు. పోలీసులు కూడా అతడి మరణాన్ని ధృవీకరించారు.

సోమవారం తుకారం అంత్యక్రియలు జరిగాయి. కానీ, అదే రోజు తుకారాం భార్య ఉష(50) కనిపించకుండా పోయింది. మరుసటి రోజు తుకారం చితాభస్మాన్ని తీసుకునేందుకు కుటుంబ సభ్యులు స్మశానం వద్దకు వెళ్లగా అక్కడే ఉష కూడా కాలిపోయి ఉన్నట్లు గుర్తించారు. చనిపోయిన ఆ భార్య భర్తలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, పోలీసులు మాత్రం కుటుంబంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సతీ చర్యను భారత్ ఎప్పుడో రద్దు చేసిన విషయం తెలిసిందే.