భర్త మెడ కోసిన భార్య  అక్కడికక్కడే మృతి 


వేములవాడ: పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వస్వామి ఆలయ పరిసరాల్లోనే భార్య..తన భర్త మెడకోసి దారుణంగా హత్య చేసింది. ఆదివారం రాత్రి జరిగిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట జిల్లా నంగనూర్‌ మండలం ఘన్పూర్‌ గ్రామానికి చెందిన బండి బాలయ్య(37), భార్య నర్సవ్వతో కలిసి ఆదివారం రాజన్న దర్శనార్థం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ వెళ్లారు. స్వామి దర్శనానంతరం ఆలయ సమీపంలోని పార్కింగ్‌ స్థలంలో రాత్రి వంట చేసుకుని తిన్నారు. అక్కడే నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో నర్సవ్వ..వెంట తెచ్చుకున్న కత్తితో మద్యం మత్తులో ఉన్న భర్త మెడ కోసింది. బాధితుడి ఆర్తనాదాలు విన్న సమీపంలోని భక్తులు అక్కడికి రావడంతో అక్కణ్నుంచి పరారైంది. బాలయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నర్సవ్వకు ఘన్పూర్‌ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండేదని.. ఆ క్రమంలోనే భర్తను పథకం ప్రకారం హత్య చేసిందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే..మృతుని బంధువులు నిందితురాలి ప్రియుడి ఇంటి ఎదుట సోమవారం పొద్దుపోయాక మృతదేహంలో ఆందోళనకు దిగారు.