భారీ భద్రత మధ్యలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు

 

పోలింగ్‌కు సర్వం సిద్ధం

సమస్యాత్మక ప్రాంతాల్లో మొహరించిన బలగాలు

ఉదయం 7 గంటల నుంచే ఓటింగ్‌…

18 రకాల గుర్తింపు కార్డులకు

ఎన్నికల సంఘం అనుమతి

హైదరాబాద్‌,నవంబరు 30(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 6 గంటల వరకు 150 డివిజన్లలో పోలింగ్‌ జరగనుంది. గ్రేటర్‌ పరిధిలో 74,67,256 మంది ఓటర్లు 1,122 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. అధికార తెరాస అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా.. భాజపా 149, కాంగ్రెస్‌ 146, తెదేపా 106, ఎంఐఎం 51, సీపీఐ 17, సీపీఎం 12, ఇతర గుర్తింపు పొందిన పార్టీలు 76, స్వతంత్ర అభ్యర్థులు 415 మంది బల్దియా బరిలో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు 9,101 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఎన్నికల కోసం 60 ఫ్లయింగ్‌స్క్వాడ్‌లు, 30 పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేశారు. మూడు కమిషనరేట్ల పరిధిలో జరగనున్న ఈ ఎన్నికలకు 51,500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. పోలింగ్‌ సిబ్బంది ఎన్నికల సామగ్రితో తమకు కేటాయించి కేంద్రాలకు తరలివెళ్లారు. కరోనా నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద కొవిడ్‌ నిబంధనలు అమలు చేయనున్నారు. ఇప్పటికే ఆయా కేంద్రాల్లో మార్కింగ్‌ వేశారు. బ్యాలెట్‌ పద్ధతిలో ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు 18 రకాల గుర్తింపు కార్డులను రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించింది. ఓటుహక్కు వినియోగించుకోవాలంటే ఎస్‌ఈసీ ప్రకటించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా పోలింగ్‌ కేంద్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.

50 వేల మందితో భారీ పోలీస్‌ భద్రత

గ్రేటర్‌ ఎన్నికలకు హైదరాబాద్‌ పోలీసులు సన్నద్ధమయ్యారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. 150 డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్‌ 84, సైబరాబాద్‌ 38, రాచకొండ పరిధిలో 28, హైదరాబాద్‌ సిటీలో 4,979 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 50 వేల మందితో భారీ పోలీస్‌ భద్రతతో పాటు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. స్ట్రాంగ్‌ రూం, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్స్‌ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. రేపటి ఎన్నికల పోలింగ్‌కు భద్రతా పరమైన అన్నీ చర్యలు తీసుకున్నామని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో 89 వార్డులు ఉన్నాయని, 4979 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లు- 1517, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లు 167 గుర్తించామని పేర్కొన్నారు. 406 మొబైల్‌ పార్టీలతో నిరంతరం మానిటరింగ్‌ చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో 29 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. 4187 గన్స్‌ డిపాజిట్‌ అయ్యాయి. 3066 మంది రౌడీ షీటర్లను బైండోవర్‌ చేశామని పేర్కొన్నారు. (చదవండి: జనతా గ్యారేజ్‌ చీ కల్వకుంట్ల గ్యారేజ్‌)”పోలీసుల తనిఖీల్లో 1.45 కోట్ల రూపాయల స్వాధీనం చేసుకున్నాం. పలు చోట్ల భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నాం. 63 ఫిర్యాదులో 55 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు జియో ట్యాగింగ్‌ ఏర్పాటు చేశాం. సోషల్‌ విూడియా పై ప్రత్యేక నిఘా ఉంచాం. కౌంటింగ్‌ కేంద్రాల బయట నిరంతర సీసీటీవీ నిఘా ఉంచాం. రేపు ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. పోలింగ్‌ రోజున ప్రతి అభ్యర్థికి కేవలం ఒక్క వార్డు వద్ద ఒక్క వాహనం మాత్రమే అనుమతి ఇస్తాం. ఎలక్షన్‌ ఏజెంట్‌ కూడా అదే వాహనం లో వెళ్ళాలని” సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు.రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 8వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు. మొత్తం 13 పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఎన్నికలు జరగుతాయని తెలిపారు. 29 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. 15 లక్షలు విలువైన మద్యాన్ని సీజ్‌ చేశామని వెల్లడించారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రజలు 9490617111 కు సమాచారం అందించాలని తెలిపారు. కమిషనరేట్‌ పరిధిలో 4,800 మంది రోహింగ్యాలు ఉన్నారని వారిలో 4,500 మందికి బయోమెట్రిక్‌ నిర్వహించామని పేర్కొన్నారు. 160 మందిపై కేసులు నమోదు చేసామని వెల్లడించారు. నకిలీ పాస్‌పోర్టు కలిగిన వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశామని సీపీ మహేష్‌ భగవత్‌ పేర్కొన్నారు.