భైంసాలో సాధారణ పరిస్థితులు

నిర్మల్‌,జనవరి23(జ‌నంసాక్షి): నిర్మల్‌ జిల్లా భైంసాలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జర్కుండా పోలీసులు చర్య తీసుకున్నారు. మూడు రోజుల క్రితం దుండగులు గట్టు మైసమ్మ ఆలయ శిఖరాన్ని ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేసిన సంగతి తెలిసిందే. వారి చర్యను నిరసిస్తూ హిందూవాహిని మంగళవారం చేపట్టిన భైంసా బంద్‌ విజయవంతమైంది. బీజేపీ, ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లతో పాటు వివిధ హిందూ కులసంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ప్రదర్శనలు చేపట్టారు. అనంతరం ఆర్డీవో రాజుకు వినతిపత్రం అందజేశారు. ర్యాలీగా విశ్రాంతి భవనం వద్దకు వచ్చి బైఠాయించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ నిందితులకు త్వరగా శిక్ష పడని పక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామన్నారు. దీంతో ఇకముందు మళ్లీ ఎలాంటి దురాగతాలుజరక్కుండా స్థానిక పోలీసులు చర్యలు తీసుకున్నారు.