మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మాతృవియోగం

సంతాపం తెలిపిన సిఎం కెసిఆర్‌, మంత్రులు
నివాళి అర్పించిన మంత్రి నిరంజన్‌ రెడ్డి
మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌30  (జనంసాక్షి) : రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాతృమూర్తి శాంతమ్మ కన్నుమూశారు. హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో గుండెపోటు రావడంతో ఆమె మరణించారు. శాంతమ్మ అంత్యక్రియలు మహబూబ్‌ నగర్‌ పట్టణంలోని వారి వ్యవసాయ క్షేత్రంలో శనివారం సాయంత్రం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తండ్రి నారాయణ గౌడ్‌ ఇదే ఏడాది ఫిబ్రవరి 14న మరణించిన విషయం తెలిసిందే. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తల్లి శాంతమ్మ మరణంపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. శాంతమ్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాతృమూర్తి అకాల మరణం పట్ల మంత్రి సత్యవతి రాథోడ్‌ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి
చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. శాంతమ్మ మృతిపట్ల మంత్రి హరీశ్‌ రావు సంతాపం వ్యక్తంచేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రులు జగదీష్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి సంతాపం తెలిపారు. మంత్రి నిరంజన్‌ రెడ్డి.. శాంతమ్మ మృతదేహానికి నివాళులర్పించారు. మాతృవియోగంతో బాధపడుతున్న మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను ఓదార్చారు.