మద్యం మత్తులో భార్య ను హ‌తమార్చిన భ‌ర్త‌

636097984532458729ఆనాధ‌లైన చిన్నారులు

నల్గొండ : మద్యం మత్తులో రోకలితో మోది భార్య హతమార్చాడో కసాయి.. ఈ సంఘటన దేవరకొండ పట్టణంలో శనివారం వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుటుంబ సభ్యుల, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పట్టణంలోని సంజయ కాలనీకి చెందిన నీల నిరంజన, సుగునమ్మల కుమార్తె మంగమ్మ(30)ను గుంటూరు జిల్లా గుర జాల మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన ఆడేపు శివయ్యతో 10సంవత్సరాల క్రితం వివాహం చేశారు. కొన్నేళ్లపాటు గొట్టిముక్కలలో కాపురం సాగించారు. శివయ్య మద్యానికి బానిసై తరచూ మంగమ్మను వేధింపులకు గురిచేయడంతో తట్టుకో లేక మూడేళ్ల క్రితం తల్లిగారి గ్రామం దేవరకొండకు వచ్చి ఓ అద్దె ఇంట్లో నివసిస్తూ కూలీ, నాలి పనులను చేస్తూ పిల్లలను పోషించుకుంటుంది. శివయ్య గొట్టిముక్కలలోనే ఉంటూ తరచూ దేవరకొండలో భార్య, పిల్లల దగ్గరకు వస్తుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం దేవరకొండకు వచ్చి మద్యం మత్తులో భార్యను డబ్బులు కావాలని వేధింపులకు గురి చేశాడు. తాను నిరాకరించడంతో శివయ్య కోపంతో రోకలిబండతో మంగమ్మ తలపై మోదాడు. మంగమ్మ తీవ్ర రక్తస్రావమై పడిపోయింది. అక్కడే ఉన్న మంగమ్మ పిల్లలను భయంతో బయటకు పరుగులు తీసి కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. అయితే శివయ్య తలుపులు వేసుకొని భార్య పక్కనే ఉన్నాడు. పోలీసులు వచ్చి రక్తం మడుగులో పడి ఉన్న మంగమ్మను ఆస్పత్రికి తరలించారు. శివయ్యను అదుపులోకి తీసుకుని, మంగమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందింది. మంగమ్మకు ఇద్దరు కుమా ర్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.