మన ఊరు మనబడి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయండి : కలెక్టర్ శ్రీహర్ష

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 3 : మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా గుర్తించిన నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
బుధవారం అలంపూర్ మండలం లింగనవాయి, భీమ వరం , గొందిమల్ల, ఉండవల్లి మండలంలోని క్యాతూరు, పుల్లూరు, బొంకూరు గ్రామాలను జిల్లా కలెక్టర్ పర్యటించి మన ఊరు మన బడి క్రింద నిర్మిస్తున్న నిర్మాణాలను పరిశీలించారు.
ఉండవల్లి మండలం తోపాటు తక్కశిల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఇందులో భాగంగా అక్కడ జరుగుతున్న మన ఊరు మన బడి కార్యక్రమంలోని పనులను పరిశీలించారు. ఎస్ఎంసి చైర్మన్లు, ఉపాధ్యాయులతో మాట్లాడారు.పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు .పాఠశాల భవనంలోని తరగతి గదులను పరిశీలించారు. ఉండవల్లి ప్రభుత్వ పాఠశాలలోని తరగతి గదులకు కిటికీలు ఏర్పాటు చేయాలని సూచించారు.పాఠశాల ఆవరణలో ఒక చోట వర్షం నీరు నిల్వ ఉండడంతో గ్రావెల్ వేయించాలని సర్పంచి రేఖకు సూచించారు. ఉండవల్లి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న రెండు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. అంగన్వాడి టీచర్లతో మాట్లాడి అక్కడ సమస్యలపై ఆరా తీశారు. అంగన్వాడి కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు . రిజిస్టర్లను పరిశీలించి శ్యామ్, మామ్ చిన్నారుల గురించి ఆరా తీశారు. చిన్నారుల తల్లులతో ప్రతి బుధవారం నిర్వహించాల్సిన సమావేశంపై ఆరా తీశారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ఏ పనులు నిర్వహిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు . పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఉండవల్లి ప్రభుత్వ పాఠశాల వద్ద నిర్మిస్తున్న మరుగుదొడ్లను పూర్తి చేయాలని సర్పంచికి సూచించారు. క్యాతూరు గ్రామంలో పీహెచ్సీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించారు. పుల్లూరు ,గొందిమల్ల గ్రామాలలో బృహత్ పల్లె ప్రకృతి వనాల్ని సందర్శించి మొక్కలు విరివిగా నాటాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ నరేందర్, అంగన్వాడి సూపర్వైజర్ అస్మా, పీ ఓ పద్మావతి, ఉపాధ్యాయులు రాణి లీలావతి మమత పంచాయతీ కార్యదర్శులు ఎస్ఎంసి చైర్మన్ నరసింహ అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.