మయన్మార్‌తో భారత్‌ బంధం ధృడమైనది

– ఆంగ్‌సాన్‌ సూకీతో మోదీ భేటి

– రొహింగ్యాలపై సానుభూతి

న్యూఢిల్లీ,,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి): మయన్మార్‌తో దృఢమైన బందాన్ని ఏర్పాటు చేసుకోవడమే భారత్‌ ప్రాధాన్యత అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీలో భాగంగా కూడా మయన్మార్‌తో మంచి బంధాలు కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మయన్మార్‌ పర్యటన కోసం మంగళవారం నాడొఇక్కడికు వచ్చిన మోడీ, నైపైతాలో ఆంగ్‌ సాన్‌ సూకీని కలిసిన తర్వాత మాట్లాడారు. ఇరు దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌ పథకంలో భాగంగా మయన్మార్‌ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని అనుకుంటున్నట్లు మోదీ తెలిపారు. పొరుగు దేశమైన మయన్మార్‌తో భద్రత అంశంలో చాలా దృష్టి పెట్టినట్లు మోదీ అన్నారు. మయన్మార్‌ దేశాస్తులకు ఉచితంగా వీసా ఇవ్వనున్నట్లు ప్రధాని చెప్పారు. భారతీయ జైళ్లలో ఉన్న 40 మంది మయన్మార్‌ పౌరులను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. రెండు దేశాల మధ్య ఉన్న నేల, సముద్ర సరిహద్దుల ఒప్పందాన్ని కొనసాగించనున్నట్లు చెప్పారు. మయన్మార్‌ ఐక్యత, సమగ్రత సుస్థిరపరిచేందుకు అందరూ కలిసి పనిచేయాలన్నారు. రాఖైన్‌ రాష్ట్రంలో రాజుకున్న రోహింగ్యా ముస్లింల హింస గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. అక్కడ చోటుచేసుకున్న హింస పట్ల ఆయన దిగ్భాంతితి వ్యక్తం చేశారు. మయన్మార్‌లో శాంతి నెలకొల్పేందుకు దారులు వెతకాలని ఆయన పిలుపునిచ్చారు. రోహింగ్యా ముస్లింల సమస్యను భారత్‌ అర్థం చేసుకోగలదు అని అన్నారు. రోహింగ్యా తెగ ముస్లింల మహావలస కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మయన్మార్‌ పర్యటనకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మయన్మార్‌లో మెజారిటీ ప్రజలైన బౌద్ధులు రోహింగ్యాలపై హింసాత్మక దాడులకు దిగుతున్న నేపథ్యంలో రోహింగ్యాలు ప్రాణాలు అరచేత పట్టుకొని పొరుగుదేశాలకు పెద్ద ఎత్తున వలస వెళ్తున్నారు.దేశంలోకి పెద్ద ఎత్తున సాగుతున్న రోహింగ్యాల వలసలపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశంలో అక్రమంగా నివసిస్తున్న 40వేల మంది రోహింగ్యాలను స్వదేశానికి పంపించాలని ప్రభుత్వం భావిస్తోంది.భద్రత, ఉగ్రవాద నిరోధం, వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన, ఇంధన రంగాల్లో ఇరుదేశాల పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని భావిస్తున్నట్టు మయన్మార్‌ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. సూకీతో భేటీ సందర్భంగా ప్రధాని మోదీ మయన్మార్‌ ప్రజలకు పలు వరాలు ప్రకటించారు. అటు ఉగ్రవాదాన్ని కలిసి కట్టుగా నిర్మూలిద్దామని మయన్మార్‌ నేత ఆంగ్‌ సాన్‌ సూకీ పిలుపునిచ్చారు. ఉగ్రవాద నిర్మూలనకు సహకరిస్తున్న భారత్‌కు థ్యాంక్స్‌ చెబుతున్నానని, కలిసి కట్టుగా ఉగ్రవాదాన్ని దేశంలో లేకుండా చూద్దామని సూకీ అన్నారు. మయన్మార్‌ రాజధాని నైపైతాలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఇరు దేశాల అధికారులు పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం ఉదయం మయన్మార్‌ ప్రభుత్వ కౌన్సిలర్‌ ఆంగ్‌ సాన్‌ సూకీతో భేటీ అయ్యారు. భారత్‌-మయన్మార్‌ ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ‘విలువైన స్నేహితుడితో భేటీ కొనసాగుతోంది. సూకీతో మోదీ భేటీ అయ్యారు’ అని భారత విదేశాంగశా అధికార ప్రతినిధి రవీష్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు.